ప్రభుత్వం రిలీఫ్ ఇవ్వకుంటే వొడాఫోన్ సంస్థను మూసేసాం: కుమార్ బిర్లా
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న వొడఫాన్ ఐడియా టెలికాంకు ప్రభుత్వం ఊరట కల్పించకపోతే సంస్థను మూసివేయాల్సి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ఛైర్మెన్ కుమార్్ మంగళం బిర్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే తమ వైపు నుంచి ఎలాంటి డబ్బులను పెట్టుబడులుగా పెట్టదని కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. అంతేకాదు ప్రభుత్వం ఆదుకోకుంటే తాము దివాళా తీస్తున్నట్లు ప్రకటించాల్సి ఉంటుందని కుమార్ మంగళం బిర్లా చెప్పారు.
ఇదిలా ఉంటే బిర్లా పలువురు కంపెనీ ప్రముఖలతో కలిసి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో గతవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వొడాఫోన్ ఐడియా కంపెనీని ఆదుకోవాలని కోరారు. అది కూడా వెంటనే జరిగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆదుకోకుంటే బిజినెస్లో గట్టి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
ప్రముఖ టెలికాం కంపెనీలను ఉద్దేశించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్తో పాటుగా వొడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీ కూడా అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ ప్రభుత్వానికి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు కంపెనీలు కలిపి రూ.81వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా కోరింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీలతో పాటు జరిమానాలు వడ్డీలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆ సమయంలో వొడాఫోన్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి రూ.50 ,921 కోట్లు నష్టాన్ని చూపింది. ఇక సుప్రీంకోర్టు ఏజీఆర్ కట్టాలని ఆదేశించడంతో అది మరింత భారమైంది. అంతేకాదు వొడాఫోన్ నష్టాల బాట పట్టగానే స్టాక్స్లో షేర్ విలువ కూడా దారుణంగా పతనమైంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 24 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వొడాఫోన్ ఐడియా సంస్థ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇక ఏజీఆర్ రూపంలో చెల్లించాల్సిన డబ్బులపై వొడాఫోన్ ఐడియా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.