Covid 19: కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసం IBM కఠిన నిర్ణయం!
కరోనా సంక్షోభం కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కరోనా ధాటికి వ్యాపారపరంగా సవాళ్లు ఎదుర్కోవడంతో ఉద్యోగాల్లో కోత పెట్టక తప్పని పరిస్థితి అని అరవింద్ కృష్ణ సారథ్యంలోని ఐబీఎం శుక్రవారం జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగించింది లేదా తొలగించాలనుకున్నది స్పష్టం చేయలేదు.
ఐదువేల మంది ఉద్యోగులను తొలగించవచ్చు
ప్రస్తుతం సంక్లిష్ఠ పరిస్థితుల్లో కంపెనీ వ్యాపార వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఐబీఎం తెలిపింది. ఈ ఉద్యోగుల తొలగింపు భారత్లో కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎంతమంది ఉద్యోగులను తొలగించేది తెలియజేయనప్పటికీ, దాదాపు 4,000 నుండి 5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని తెలుస్తోంది.
కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసమే..
క్లిష్ట పరిస్థితుల్లో తమ ఉద్యోగుల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తమ ఉద్యోగులందరికీ జూన్ 2021 నాటికి సబ్సిడీ మెడికల్ కవరేజీ ఉంటుందని కొంతలో కొంత ఊరట కల్పించింది. ఎప్పటికప్పుడు తాము పరిస్థితిని ఆకలింపు చేసుకుంటున్నామని, ఈ నిర్ణయం (ఉద్యోగాల కోత) కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసమని తెలిపింది.
ఈ రాష్ట్రాల్లోనే వేలాదిమంది..
అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లోనే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, మిసౌరీ, న్యూయార్క్ నగరాల్లో ఉద్యోగులను ప్రభావితం చేశాయని వార్తలు వస్తున్నాయి. వార్షిక నివేదిక ప్రకారం ఐబీఎంలో గత డిసెంబర్ 31వ తేదీ నాటికి 3,52,600 మంది ఉన్నారు. వారిలో 95 శాతం కంటే ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
కఠిన నిర్ణయం..
ఐబీఎంకు ఇది అతి పెద్ద మొదటి తొలగింపులు. ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ కంపెనీకి గత కొన్ని రోజులుగా రెవెన్యూ తగ్గుతోంది. న్యూయార్క్ అర్మోంక్ కంపెనీ జనవరి - మార్చి క్వార్టర్లో 3.4 శాతం రెవెన్యూ తగ్గుదలను నమోదు చేసింది. కరోనా కారణంగా బిజినెస్ తగ్గింది.