అప్పుల్లేని రిలయన్స్ కోసం ముకేష్ అంబానీ ప్రస్దానం: కరోనా వేళ అనితర సాధ్యం
అసాధ్యాలను సుసాధ్యం చేయడం అనేది ఎప్పుడూ చరిత్రలోనే నిలిచిపోయే ప్రయత్నమే అవుతుంది. సంక్షోభాల్లో సైతం ఇలాంటి ప్రయత్నాలను చేసే వాళ్లు ఎలా ఉంటారని అడిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ పేరు ఠక్కున చెప్పుకోవచ్చు. 2021 మార్చి నాటికి రిలయన్స్ ను అప్పుల్లేని సంస్దగా మార్చేందుకు ముకేష్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అనితర సాధ్యంగా కనిపించడం వనుక కరోనాయే కాదు ఎన్నో సంక్షోభాలు ఉన్నాయి. అయినా ఎక్కడా తగ్గకుండా మొక్కవోని దీక్షతో ముకేష్ ప్రయాణం సాగిస్తున్నారు.
భారీగా తగ్గిన బంగారం ధర: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు సక్సెస్ అయితే...!
రిలయన్స్ అప్పురహిత ప్రస్ధానం..
దేశంలో ఎన్నో మల్టీ మిలియనరీ కంపెనీలు ఉన్నా, కోటీశ్వరులున్నా పెట్టుబడుల ఆకర్షణలో రిలయన్స్ శైలే వేరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ వింగ్ అయిన జియో ప్లాట్ ఫామ్ లో అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ తాజాగా 6600 కోట్ల పెట్టుబడి పెట్టి 1.35 శాతం షేర్లను దక్కించుకుంది. ఈ డీల్ తర్వాత జియోలో అంతర్జాతీయంగా టెక్నాలజీ ఇన్వెస్టర్ల వాటా రూ.67,194 కోట్లకు చేరింది. ఇందులో ఫేస్ బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటిక్ ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు రిలయన్స్ కేవలం తన డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో మార్కెట్ విలువను ఏ స్ధాయిలో పెంచుకుందో ఇట్టే అర్దమవుతుంది.
రైట్స్ ఇష్యూతో మరింత ముందుకు...
రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ ను అప్పుల్లేని సంస్ధగా మార్చే ప్రయత్నంలో కరోనా టైమ్ లో విదేశీ టెక్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కాదు, రైట్స్ ఇష్యూకు కూడా వెళ్లబోతున్నారు ముకేష్. రూ.53,125 కోట్ల విలువైన మెగా రైట్స్ ఇష్యూకు వెళ్లడం ద్వారా రిలయన్స్ లోకి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇందులో తమ సొంత ఉద్యోగులకు ఒక్కొక్కరికీ 15 చొప్పున ఒక్కొక్కటీ రూ. 1257 చొప్పున విక్రయించబోతున్నారు. అంతే కాదు వీటిని కొనుగోలు చేసిన తర్వాత 25 శాతం మొత్తం చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తాన్ని మేలో ఓ వాయిదా, నవంబర్ లో మరో వాయిదాగా చెల్లిస్తే చాలంటున్నారు. అంటే తన లక్ష్యం మార్చి 2021 లోపే మెగా రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చే మొత్తాన్ని తన ఖాతాలో జమ చేసుకోబోతున్నారన్నమాట.
మరిన్ని వ్యూహాలకు పదును...
విదేశీ ఇన్వెస్టర్ల ద్వారా రూ.67,194 కోట్లు, మెగా రైట్స్ ఇష్యూతో రూ. 53,125 కోట్ల రూపాయలను తన సంస్ధలోకి తీసుకొస్తున్న ముకేష్.. అక్కడితో ఆగిపోకుండా చమురు దిగ్గజం బ్రిటీష్ పెట్రోలియం తో ఒప్పందం ద్వారా మరో 7 వేల కోట్ల రూపాయలను ఆకర్షించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు తన ఆయిల్ టూ కెమికల్ (ఓటీసీ) బిజినెస్ లో 20 శాతం వాటాను సౌదీక చెందిన మరో ఆయిల్ దిగ్గజం ఆరామ్కోకు విక్రయించడం ద్వారా మిగిలిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్స్ కూడా పూర్తయితే మార్చి 2021 లోపే రిలయన్స్ సంస్ధ దేశంలోనే అప్పుల్లేని కార్పోరేట్ సామ్రాజ్యంగా రికార్డుల కెక్కడం ఖాయం.