ఎంత అడిక్షన్ అంటే.. పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేరు!
అమ్మ, నాన్న, పిల్లలు.. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోరు. కారణం - బిజీ లైఫ్. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పడిపోయి.. తల్లిదండ్రులు కడుపున పుట్టిన పిల్లల్ని పట్టించుకోలేని స్థితి. పిల్లలూ అంతే. చదువు, ఫ్రెండ్స్, షికార్లు.. తల్లిదండ్రులతో గడిపే తీరిక లేదు. కానీ, అందరికీ కావలసినది మాత్రం ఒకటుంది. అది.. 'మొబైల్ ఫోన్'.
చేతిలో మొబైల్ ఫోన్ లేకుంటే ప్రపంచంతో సంబంధం తెగిపోయినంత ఫీలింగ్. ఎవరికీ పూట గడవదు. మరోవైపు సర్వేలు, అధ్యయనాలు కూడా ఇదే చెబుతున్నాయి. మొబైల్ ఫోన్.. మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని ఘోషిస్తున్నాయి. రోజువారీ మానవ సంబంధాలపై ఈ మొబైల్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోందని చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ వివో, సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇటీవల చేసిన సర్వే వెల్లడించింది.
ఎనిమిది నగరాల్లో, రెండు వేల మందితో...
మొబైల్ ఫోన్ వాడకంపై దేశంలోని ఎనిమిది నగరాల్లో జరిగిన ఈ సర్వే పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఈ సర్వేలో 18-45 ఏళ్ల మధ్య ఉన్న 2 వేల మంది అభిప్రయాలు తీసుకున్నారు. వీరిలో గృహిణులు, ఉద్యోగినులు, ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు యూజర్ల జీవితాలను, సంబంధ బాంధవ్యాలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయనే అంశంపై ఈ సర్వేను నిర్వహించారు. ఇప్పుడు నిత్యావసరాల్లో స్మార్ట్ఫోన్ కూడా ఒకటని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ్ మార్యా వ్యాఖ్యానించారు.
75 శాతం మందికి టీనేజ్లోనే మొబైల్...
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ టీనేజ్లోనే తాము మొబైల్ ఫోన్ను కొన్నట్టు చెప్పారు. డిగ్రీ పూర్తికాకముందే కొన్నామని 41 శాతం మంది చెప్పారు. ఇక హైస్కూల్ దశ నుంచే ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని మరికొంతమంది చెప్పారు. కనీసం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారైనా ఫోన్ చెక్ చేసుకోకుండా ఉండలేకపోతున్నామని పలువురు చెప్పారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలోనూ ప్రతి ముగ్గురిలో ఒకరు తరచూ మొబైల్ చెక్ చేసుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.
ఏటా 1800 గంటలు దానిపైనే...
సగటు భారతీయులు తాము మెలకువగా ఉన్న సమయంలో మూడో వంతు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. అంటే.. ఏటా 1800 గంటలు.. రోజుకు ఐదు గంటలు మొబైల్ ఫోన్ కోసం కేటాయిస్తున్నారన్న మాట. ఒకటే ఇంట్లో ఉంటూ.. ముఖాముఖి మాట్లాడుకోకుండా మొబైల్లో మాట్లాడుకునే వారి సంఖ్య పెరుగుతోంది. నెలలో ఒకసారైనా తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిసి సంభాషిస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. పదేళ్ల క్రితంతో పోల్చుకుంటే.. ఇప్పుడు 30 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఇలా చేస్తున్నట్లు సర్వేలో తేలింది.
మనుషులతో గడిపితేనే సంతోషం...
మొబైల్ఫోన్ లేని జీవితం.. అంటే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపడం కూడా చాలా ముఖ్యమని ప్రతి ఐదుగురిలో ముగ్గురు అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కాకుండా సాటి మనుషులతో గడపడం వల్ల జీవితం మరింత సంతోషంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఇక స్మార్ట్ఫోన్ వాడకం మితిమీరితే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం తమకు తెలుసని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది చెప్పారు. కాల్స్తోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుండడంతో స్మార్ట్ఫోన్ అందరికీ కీలకంగా మారిందని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ హెడ్ ప్రభురామ్ వ్యాఖ్యానించారు.