HDFC: నెలరోజుల్లో మూడోసారి గృహ రుణాలు పెంపు: ఈఎంఐ కట్టాలంటే..తాకట్టు
ముంబై: దేశ అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ తన రుణ గ్రహీతలకు వరుస పెట్టి షాకుల మీద షాకులు ఇస్తోంది. నెల రోజుల వ్యవధిలో మూడోసారి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యం తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్స్ (ఆర్పీఎల్ఆర్)ను పెంచింది. కిందటి నెలలో రెండుసార్లు ఆర్పీఎల్ఆర్ను పెంచింది. ఇప్పుడు మరోసారి వాటిని సవరించింది. జూన్ నెల తొలి రోజే దాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అయిదు బేసిస్ పాయింట్ల మేర ఆర్పీఎల్ఆర్ను పెంచినట్లు వివరించింది.
ఇప్పటికే రెండుసార్లు ఆర్పీఎల్ఆర్ బేసిస్ పాయింట్లను పెంచడం వల్ల గృహ రుణగ్రహీతలు అధిక ఈఎంఐలను ఎదుర్కొంటోన్నారు. ఇప్పుడు మరోసారి దాన్ని సవరించడంతో అదనపు భారాన్ని మోపినట్టయింది. కిందటి నెల 9వ తేదీన 30 బేసిస్ పాయింట్లను పెంచిన విషయం తెలిసిందే. దీనివల్ల 30 లక్షల రూపాయల వరకు గృహ రుణాలను తీసుకున్న వారు ప్రతినెలా 7.10 శాతం మేర ఈఎంఐను చెల్లించాల్సి వచ్చింది.
30 నుంచి 75 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుని ఉంటే వారిపై 7.35 శాతం, రుణ మొత్తం 75 లక్షలకు పైగా ఉంటే 7.45 శాతం ఈఎంఐ వర్తించింది. ఇప్పుడు దీనికి మరో అయిదు బేసిస్ పాయింట్లను జత చేసింది. ఫలితంగా ఈ ఈఎంఐ శాతం మరింత పెరుగుతుంది. ఇది మరింత రుణ గ్రహీతలకు మరింత భారం కానుంది. తమ నెలవారీ ఈఎంఐల మొత్తం మరింత పెరగడం వల్ల అదనపు ఆర్థిక భారాన్ని భరించక తప్పని పరిస్థితి ఎదురైంది.
ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ రుణ రేట్లు పెంచాయి. ఇవ్వాళ్టి నుంచే అవి అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచాయి ఈ రెండు బ్యాంకులు కూడా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్కు అదనంగా 15 బేసిస్ పాయింట్లను జత చేసింది. ఫలితంగా సంవత్సరానికి కట్టాల్సిన మార్జినల్ కాస్ట్ 7.4 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ తన వార్షిక మార్జినల్ కాస్ట్ను 7.55 శాతానికి పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక మార్జినల్ కాస్ట్ 7.35 శాతంగా ఉంది.