జీఎస్టీ: పన్నులు పెంచలేదు, స్లాబ్స్ తగ్గించలేదు... కారణమిదేనా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 1, 2020 నుంచి లాటరీలపై ఏకరీతి పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో స్లాబ్ రేట్లు మారుతాయని చాలామంది భావించారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న స్లాబ్ రేట్లను మూడుగా మారుస్తారని, కొన్నింటి ధరలు పెరుగుతాయని, మరికొన్నింటి ధరలు తగ్గుతాయని భావించారు. కానీ అలా జరగలేదు.
జీఎస్టీ కీలక నిర్ణయాలు: లాటరీలపై 28% పన్ను, రిటర్న్స్ సమర్పించలేదా.. గుడ్న్యూస్
అలా చేస్తే మరింత మందగమనం
జీఎస్టీలో పన్నుల్ని పెంచవద్దని స్లాబులను మార్చవద్దని జీఎస్టీ కౌన్సిల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మందగమనం ఉందని, పన్నులు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మందగించేలా చేస్తుందని మెజార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
మందగమనం వల్లే జీఎస్టీ ఆదాయం పడిపోతోంది
ఓ వైపు పన్నులు, స్లాబుల్లో మార్పులు వద్దని చెప్పిన రాష్ట్రాలు మరోవైపు జీఎస్టీ వసూళ్ల క్షీణతపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. అయినప్పటికీ ఆర్థిక మందగమనం వల్లే జీఎస్టీ ఆదాయం పడిపోతోందని, తక్కువ పన్ను రేట్ల వల్ల కాదని పేర్కొన్నాయి. ఈ క్రమంలో పన్నుల పెంపు, స్లాబ్స్ మార్పు సరికాదని వారు పేర్కొన్నారు.
స్లాబ్స్ తగ్గింపు
ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రేట్లు, స్లాబ్స్ తగ్గింపు లేదా పెంపు గురించి చర్చించలేదని, వాటిపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారుల కమిటీ కూడా ఎలాంటి సూచనలు చేయలేదన్నారు.
బకాయిల ఆలస్యంపై ఆందోళన
జీఎస్టీ బకాయిల జాప్యంపై వివిధ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో కేంద్రం డిఫాల్ట్ అంచున ఉందని బీజేపీయేతర రాష్ట్రాలు మండిపడ్డాయి. సకాలంలో చెల్లించాలని చెప్పాయి. నష్టపరిహారంపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని భావించాయి. కానీ నిరాశ ఎదురైంది. అయితే జీఎస్టీ నష్టపరిహారం రాష్ట్రాల హక్కు అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే బకాయిలు ఎప్పటిలోగా ఇస్తామనే విషయమై స్పష్టత రాలేదు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.