జీఎస్టీ కీలక నిర్ణయాలు: లాటరీలపై 28% పన్ను, రిటర్న్స్ సమర్పించలేదా.. గుడ్న్యూస్
న్యూఢిల్లీ: 38వ జీఎస్టీ సమావేశంలో బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై ఒకే పన్ను విధానం ఉండాలని, 28 శాతం పన్ను వసూలు చేయాలని తీర్మానించింది. పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎక్కడికి అక్కడే పరిష్కరించేందుకు వీలుగా జోనల్, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక లీజులపై చెల్లించే అప్ ఫ్రంట్ అమౌంట్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు పూర్తి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు.
హైదరాబాద్లో బౌన్స్ స్కూటర్ షేరింగ్ సేవలు, కి.మీ.కు రూ.1!
ఓటింగ్ ద్వారా లాటరీలపై 28 శాతం జీఎస్టీకి నిర్ణయం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. లాటరీలపై పన్ను విధానాన్ని అమలు చేయనుంది. 2020 మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర, ప్రయివేటు లాటరీలపై 28% జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న లాటరీలపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా, ఏదైనా రాష్ట్రం ఆమోదంతో ఆ రాష్ట్రం వెలువల విక్రయిస్తున్న లాటరీలపై 28 శాతంగా ఉంది. ఇప్పుడు లాటరీలపై ఒకే పన్ను (28%) విధించాలనే ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించారు. 21 రాష్ట్రాలు అనుకూలంగా ఓటు వేశాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.
ఇబ్బందులు, ఫిర్యాదుల పరిష్కారానికి పరిష్కార కమిటీలు
- జీఎస్టీలో అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిర్యాదుల పరిష్కారానికి జోనల్, రాష్ట్రస్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఎదురవుతున్న సాధారణ ఫిర్యాదులను ఈ కమిటీ జోనల్, రాష్ట్రస్థాయిలో పరిష్కరిస్తాయి.
జీఎస్టీ రిటర్న్స్ సమర్పించని వారికి ఊరట
- 2017-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ 9 ఫారంలో సమర్పించే వార్షిక రిటర్న్, ఫారం జీఎస్టీఆర్ 9సీ రూపంలో సమర్పించే రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ సమర్పణకు గడువును 2020 జనవరి 31 వరకు పొడిగించారు.
- 2017 జూలై నుంచి 2019 నవంబర్ వరకు ఫారం జీఎస్టీఆర్ 1 సమర్పించని వారు 2020 జనవరి లోపు సమర్పిస్తే జరిమానా ఉండదు.
- ఫారం జీఎస్టీఆర్ 1ని 2017 జూలై నుంచి వరుసగా రెండు ట్యాక్స్ పీరియడ్లలో సమర్పించని పన్ను చెల్లింపుదారులకు ఈ-వే బిల్లులు బ్లాక్ చేస్తారు.
- ఫారం జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే తీసుకోవాల్సిన చర్యలపై పన్ను అధికారులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జారీ చేస్తారు.
తప్పుడు ఇన్వాయిస్ ఇస్తే
- తప్పుడు ఇన్వాయిస్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు. మోసపూరిత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అందుకున్న వాటిని బ్లాక్ చేస్తారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 20 శాతం అంతకుమించి యాజమాన్య హక్కులు ఉన్న సంస్థలు పారిశ్రామిక, ఆర్థిక మౌలిక వసతుల కోసం దీర్ఘకాల లీజుకు తీసుకున్న ప్లాట్లపై చెల్లించాల్సిన అప్ ఫ్రంట్ అమౌంట్ను పూర్తిగా మినహాయంచారు. ఈ మార్పు 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.
- లాటరీలపై జీఎస్టీ 28 శాతం. ఈ కొత్త పన్ను విధానం మార్చి 1వ తేదీ నుంచి అమలవుతుంది.
- హెచ్ఎస్ 3923, 6305 కిందకు వచ్చే అల్లిన, అల్లని బ్యాగులు, పాలిథీన్ సాక్సులు, ప్యాకేజీ గూడ్స్ అన్నింటిపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచారు. ఇది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.