చేనేత, జౌళీ పరిశ్రమకు ఊరట, 5% నుండి 12% జీఎస్టీ పెంపు వాయిదా
గుడ్న్యూస్! వస్త్ర పరిశ్రమపై జనవరి 1, 2022 నుండి జీఎస్టీని పెంచాలనే ప్రతిపాదనలపై జీఎస్టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని తీర్మానం చేసింది. వచ్చే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయమై అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు వెల్లడించింది. చేనేత, జౌళీ పరిశ్రమపై జీఎస్టీని ఐదు శాతం నుండి పన్నెండు శాతానికి పెంచాలని గతంలో నిర్ణయించారు. ఇది జనవరి 1 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి వాయిదా పడింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దుస్తులపై జీఎస్టీని ఐదు శాతం నుండి పన్నెండు శాతం పెంచాలనే నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. దీంతో వాయిదా వేసింది. డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సహా అనుబంధ రంగాల వర్తకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్మలమ్మ పలు రాష్ట్రాలతో, రంగాలతో జరిపిన సమావేశంలోను ఈ అంశం చర్చకు వచ్చింది. మెజార్టీ రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. నిర్మలమ్మకు కేటీఆర్ లేఖ కూడా రాశారు.
చేనేత, జౌళీ పరిశ్రమపై జీఎస్టీని పెంచితే విక్రయాలపై ప్రమాదం చూపుతాయని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పత్తి, నూలు ధరలు గత ఏడాది దాదాపు నలభై శాతం పెరిగాయని, రసాయనాలు, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఈ రంగంలో ఎనభై శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.