జెమ్... నిజంగానే జెమ్! రూ 40,000 కోట్ల మార్క్ దాటిన ప్రభుత్వ పోర్టల్!
ప్రపంచమంతా ఈ-కామర్స్ వైపు పరుగులు తీస్తుంటే... భారత ప్రభుత్వం కూడా అటువైపు దృష్టి సారించింది. అన్ని రకాల ప్రభుత్వ విభాగాలు అనేక రకాల ప్రొడక్టులను టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తాయి. అందులో కొన్ని స్టేషనరీ ఐటమ్స్ వంటి చిన్న చిన్న ఉత్పత్తులు కూడా ఉంటాయి. వాటిని కూడా టెండర్ల ద్వారా కొనుగోలు చేసేబదులు.... ఒక ఈ కామర్స్ పోర్టల్ ద్వారా చిన్న చిన్న వర్తకుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడువు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (జెమ్) పేరుతో ఒక పోర్టల్ కు అంకురార్పణ చేశారు. ఆగష్టు 2016 లో ప్రారంభించిన ఈ పోర్టల్ దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ... ప్రస్తుతం రూ వేల కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకుంది. దీంతో అటు ప్రభుత్వ విభాగాలు తక్కువ ధరలో ఉత్పత్తులను పొందుతుండగా... లక్షల్లో చిన్న వర్తకులు వాటిని సరఫరా చేస్తూ లబ్ది పొందుతున్నారు. ఈ విజయాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వం... జెమ్ ను మరింతగా విస్తరించాలని భావిస్తోంది.
రూ 40,000 కోట్లు...
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీల స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్ కార్యకలాపాలు ఉండటం తో దీనిపై ప్రభుత్వానికి గురి కుదిరింది. ఇప్పటికే జెమ్ రూ 40,000 కోట్ల మార్కు వ్యాపారాన్ని నమోదు చేసింది. ఈ విషయాన్ని జెమ్ ఎక్సపెన్డిచరు సెక్రటరీ టీ వీ సోమనాథన్ వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది. జెమ్ పేరుతో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ను నిర్వహిస్తున్నామని, దాని ద్వారా సుమారు 1,00,000 టెండర్లకు ఎలక్ట్రానిక్ బిడ్స్ నమోదు అవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ స్థాయిలో టెండర్లు వస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ ప్రొక్యూర్మెంట్ విలువ వార్షిక ప్రాతిపదికన రూ 18 లక్షల కోట్ల నుంచి రూ 19 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఆ మేరకు జెమ్ కార్యకలాపాలను మరింతగా విస్తరించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయని అయన పేర్కొన్నారు.
3 లక్షల మంది సెల్లర్లు ...
పెద్ద పెద్ద ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ ల కు ధీటుగా ... ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్ కూడా పనిచేస్తోంది. ఈ పోర్టల్ లో ఇప్పటి వరకు 3.24 లక్షల మంది వెండర్లు (సెల్లర్లు) నమోదయ్యారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి మార్కెట్ ప్లేసుల్లో కూడా 5 లక్షల కు మించి వెండర్లు ఉండరు. అంటే జెమ్ ఏ స్థాయిలో దూసుకుపోతోందో అంచనా వేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కొనుగోలు చేసే (ప్రొక్యూర్మెంట్) ఉత్పత్తుల విలువ 10 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని సోమనాథన్ చెప్పారు. భారత్ తో సహా చాలా దేశాల్లో వాటి జీడీపీ లో సుమారు 20% నికి ఇది సమానంగా ఉంటుందని వెల్లడించారు. దీంతో ఈ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సిందల్లా... ఆలస్యం చేయకుండా సంకుచిత ధోరణి విడనాడి వేగంగా కచ్చితమైన నిర్ణయాలతో జాగ్రత్తగా దీనిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
రూ 3 లక్షల కోట్ల టార్గెట్...
స్థాపించిన మూడేళ్ళ లోనే రూ 40,000 కోట్ల టర్నోవర్ మార్కు దాటిన జెమ్... ప్రస్థానం కేంద్ర ప్రభుత్వానికి ముచ్చట గొలుపుతుంది. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జెమ్ కు అతిపెద్ద టార్గెట్ ను నిర్దేశించారు. త్వరలోనే జెమ్ రూ 3 లక్షల కోట్ల టర్నోవర్ స్థాయిని అందుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి తన 2020 బడ్జెట్ ప్రసంగంలోనే పేర్కొనటం విశేషం. ఇలాంటి చర్యల ద్వారా ఒకవైపు ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరుగుతుంది, మరో వైపు చిల్లర వర్తకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి వచ్చే రెండు మూడేళ్ళ లో జెమ్ ఇంకెన్ని మైలు రాళ్లను అధిగమిస్తుందో... ఎన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందో!