వేతనజీవులకు షాక్: మందగమనం ఎఫెక్ట్, ఆదాయపు పన్ను ఊరట లేనట్లే!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్లో ఎక్కువమంది వేచి చూసేది ఆదాయపు పన్ను ఊరట గురించి. వేతనజీవులకు ఐటీ మినహాయింపు రూ.7 లక్షల వరకు పెంచవచ్చునని ప్రచారం సాగింది. అయితే మందగమనం కారణంగా జీఎస్టీ కలెక్షన్లు తగ్గడం, కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వంటి కారణాల వల్ల రెవెన్యూ తగ్గింది. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు ఊరట ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
నిన్న బంగారంపై పెరిగిన టారిఫ్, రేపు..: మోడీ టార్గెట్ అదేనా?
రూ.2 లక్షల కోట్ల రాబడి తగ్గింది..
ఆర్థిక మందగమనం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్ల మేరకు తగ్గే అవకాశముందని అంచనా. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పొరేట్ టాక్స్ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.5 లక్షల కోట్ల వరకు గండి పడుతోంది. జీఎస్టీ కలెక్షన్లు తగ్గడంతో మరో రూ.50,000 కోట్ల ప్రభావం పడనుంది. ఈ కారణంగా వచ్చే బడ్జెట్పై వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఆశలు పెట్టుకోవద్దని అంటున్నారు.
ఐటీ స్లాబ్స్ తగ్గింపు ఉండకపోవచ్చు
ఐటీ స్లాబ్స్ తగ్గింపు తదితర నిర్ణయాలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. కార్పోరేట్ పన్ను తగ్గింపు తర్వాత ఐటీ మినహాయింపులు ఉంటాయని కొంతమంది భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు. పన్ను వసూళ్లు అంచనాల కంటే తక్కువ ఉండటం, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మోడీ ప్రభుత్వం పెట్టుకున్న నిధుల సమీకరణ లక్ష్యాలు నెరవేరకపోవడం ఈ ఆశలపై నీళ్లు జల్లుతోందని అంటున్నారు.
రాబడి అంచనా ఇదీ...
కార్పోరేట్ ట్యాక్స్ను గత 28 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 10 శాతం తగ్గించడంతో ఖజానాకు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం తగ్గుతోంది. కార్పొరేషన్ ఆదాయం పన్ను (CIT) రూ.7.66 లక్షల కోట్లుగా, వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.5.69 లక్షల కోట్లుగా 2019-20 బడ్జెట్ అంచనా. జీఎస్టీ ఆదాయాన్ని 6.63 లక్షల కోట్లుగా నిర్దేశించారు. కస్టమ్స్ రెవిన్యూను రూ.1.56 లక్షల కోట్లుగా, ఎక్సైజ్ రెవిన్యూను రూ.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24.59 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. ఇందులో రాష్ట్రాల వాటా రూ.8.09 లక్షల కోట్లు, కేంద్రం వాటా రూ.16.50 లక్షల కోట్లుగా ఉంది. కానీ ట్యాక్స్ ఆదాయం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు పైగా తగ్గుతుందని భావిస్తున్నారు. గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్లు రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.3.75 లక్షల కోట్ల వరకు తగ్గవచ్చునని అంచనా.