Net direct tax collections: పన్ను వసూళ్లు 86% పెరిగాయ్
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను ప్రభుత్వ మొత్తం ట్యాక్స్ కలెక్షన్స్ 86 శాతం పెరిగి రూ.5.57 లక్షల కోట్లు దాటాయి. ఈ మేరకు సోమవారం పార్లమెంటుకు నివేదించారు. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.2.46 లక్షల కోట్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ రూ.3.11 లక్షల కోట్లుగా నమోదయింది. FY 2021-2022లో 2,46,519.82 కోట్లు వసూలయ్యాయి. అంతకుముందు ఇదే కాలంలో రూ.1,17,783.87 వసూలయ్యాయి.
ఈ మేరకు లోకసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. "2021-22 మొదటి త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్నులు రూ.2,46,519.82 కోట్లు. FY21లో ఇదే త్రైమాసికం రూ.1,17,783.87 కోట్లతో పోలిస్తే ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 109.30 శాతం వృద్ధి ఉంది' అని తెలిపారు. పరోక్ష పన్నుల వసూళ్లు రూ.1,82,862 కోట్ల నుండి 70.3 శాతం పెరిగి రూ.3,11,398 కోట్లకు చేరాయన్నారు.
నల్లధనం, పన్నుల విధింపు చట్టం-2015 కింద 107కి పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. 2021 మే 31 నాటికి ఈ చట్టం కింద 166 కేసుల్లో తీర్పులు వెల్లడయ్యాయి. తద్వారా రూ.8,316 కోట్ల బకాయిలు వసూలు అయ్యాయి. హెచ్ఎస్బీసీ కేసుల్లో రూ.8,465 కోట్ల మేర వెల్లడించని ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకు రావడంతో పాటు రూ.1,294 కోట్ల జరిమానా విధించారు. ఇంటర్నేషనల్ కన్షార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ కేసుల్లో సుమారు రూ.11,010 కోట్ల వెల్లడించని ఆదాయాన్ని గుర్తించారు. పనామా, ప్యారడైజ్ పేపర్స్ లీక్ కేసులకు సంబంధించి వరుసగా రూ.20,078 కోట్లు, రూ.246 కోట్ల వెల్లడించని ఆదాయం గుర్తించారు.