50 రోజుల్లో రూ.26,242 కోట్ల ఐటీ రీఫండ్స్ చెల్లింపులు
ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ ననెల నుండి దాదాపు 17 లక్షల మందికి రూ.26,242 కోట్ల రీఫండ్ జారీ చేసింది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల చేతుల్లో లిక్విడిటీ పెంచి, తద్వారా డిమాండ్ పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత రెండు నెలల్లో ఐటీ డిపార్టుమెంట్ 16,84,298 మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.26 కోట్లకు పైగా ఐటీ రిఫండ్స్ జరిపింది.
మారటోరియం మరో 3 నెలలు పొడిగింత, బ్యాంకులపై ఒత్తిడి
ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు 16,84,298 ట్యాక్స్ అసెస్లు తిరిగి పొందినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (CBDT) తెలిపింది. వీటిలో 15,81,906 మందికి రూ.14,632 కోట్ల ఆదాయ పన్ను రిఫండ్స్, 1,02,392 మంది కార్పోరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ.11,610 కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ చెల్లించినట్లు తన ప్రకటనలో వెల్లడించింది.
ప్రజల వద్ద నగదు లభ్యత పెంచేందుకు, కరోనా సంక్షోభంతో పోరాడటానికి, కంపెనీలు తగినన్ని నిధులు కలిగి ఉండేందుకు రీఫండ్స్ జారీ ప్రక్రియను ఐటీ విభాగం వేగవంతం చేసింది. కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించారు. అప్పటి నుండి రీఫండ్స్ ప్రక్రియ మరింత వేగవంతమైంది.
మే 16వ తేదీతో ముగిసిన వారంలో రూ.2,050.61 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్స్, రూ.867.62 కోట్ల కార్పోరేట్ పన్ను రీఫండ్స్ ఐటీ విభాగం ప్రాసెస్ చేసింది. మే 17-21 తేదీల్లో ఆధాయపు పన్ను రీఫండ్స్ కింద రూ.2,672.97 కోట్లు, కార్పోరేట్ రీఫండ్స్ కింద రూ.6,714.34 కోట్లు పన్ను చెల్లింపుదారుల ఖాతాలో వేసింది. మొత్తం రూ.9,387..31 కోట్ల రీఫండ్స్ జారీ చేసింది.