ఐటీఆర్ ఫైలింగ్ టైమ్లో ఎందుకు, కొత్త ఐటీ పోర్టల్తో సమస్యలు: శశిథరూర్ ఆగ్రహం
సీనియర్ కాంగ్రెస్ లీడర్, లోకసభ సభ్యులు శశిథరూర్ ఇటీవల తీసుకు వచ్చిన కొత్త ఐటీ పోర్టల్ ఇబ్బందులపై స్పందించారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను విభాగం నెల రోజుల క్రితం కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే దీంట్లో సమస్యలు తలెత్తడంతో యూజర్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పుడే స్పందించిన నిర్మలమ్మ సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శశిథరూర్ స్పందించారు.
రూ.4200 కోట్లు ఖర్చు చేసినా...
కొత్త ఐటీ పోర్టల్ కోసం రూ.4200 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇప్పటికీ సమస్యలు తలెత్తుతున్నాయని శశిథరూర్ మంగళవారం అన్నారు. పెద్ద ఎత్తున ఖర్చు తయారు చేసిన కొత్త ఐటీ పోర్టల్ను యూజర్-ఫ్రెండ్లీగా తయారు చేయడానికి బదులు వారికి ఇబ్బందులు సృష్టించిందన్నారు. శశిథరూర్ ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆదాయ పన్ను పోర్టల్లోని ఇబ్బందులను చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇటీవల శశిథరూర్ దృష్టికి తీసుకు వెళ్లారు. కొత్త పోర్టల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో గతంలో లాగిన్ టైమ్ కంటే ఎక్కువ సమయం తీసుకోవడం కూడా ఉంది. ఇది మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.
ఇలాంటి సమయంలో ఎందుకు
కొత్త ఐటీ పోర్టల్లోని అన్ని కార్యకలాపాలు ఇబ్బందికరంగా మారాయని, ఐటీఆర్ ఫైలింగ్, 15సీఏ/సీబీ ఫామ్స్, డేటా ప్రిపరేషన్ సహా వివిధ సమస్యలు ఉన్నాయని ఈ మాజీ కేంద్రమంత్రి అన్నారు. అసలు జూన్ నెలలో ఆదాయ పన్ను శాఖ పోర్టల్ను మార్చాలని ప్రభుత్వం ఎందుకు భావించిందో అర్థం కావడం లేదని, ఎందుకంటే ఈ సమయంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఉంటుందన్నారు. ఏళ్ల కొద్ది పాత ఆదాయ పన్ను పోర్టల్ చాలా స్మూత్గా సాగుతోందని, ఇలాంటప్పుడు కొత్తది ఇప్పుడే తీసుకు రావాల్సిన అవసరం ఏముందని అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్కు నోటీసులు
ఇదిలా ఉండగా, శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఐటీ అధికారులకు సమన్లు జారీ చేసింది. డిజిటల్ స్పేస్లో పౌరుల హక్కులకు సంబంధించిన అంశాలపై ముఖ్య ఆధారాలను సేకరించేందుకు సమన్లు పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ట్విటర్ ఇండియా భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటుందా లేదా అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.