ఫార్మాలోనూ చైనాకు చెక్! బల్క్ డ్రగ్, మెడికల్ డివైస్ పార్క్లకు గైడ్లైన్స్
ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ నుండి ఫార్మా వరకు సాధ్యమైనంత వరకు చైనా నుండి దిగుమతులు తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ఫార్మా రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (API) వంటి ముడి పదార్థాలను సాధ్యమైనంత మేర తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు, నాలుగు ప్రాంతాల్లో మెడికల్ డివైజ్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు.
మరో కీలక అడుగు: 666 చైనా వస్తువులకు చెక్, రూ.వేలకోట్లు ఆదా, అదొక్కటే ఆందోళన..
కేంద్రం భారీ సాయం
దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు, నాలుగు మెడికల్ డివైస్ పార్కులను ఏర్పాటుచేయడానికి సంబంధించి ఫార్మాస్యూటికల్స్ విభాగం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సదానంద తెలిపారు. క్లిష్టమైన API/KSM, మెడికల్ డివైజ్ల ఉత్పత్తిని దేశంలోనే ప్రోత్సహించేందుకు మార్చి 12, 2020న కేంద్ర ప్రభుత్వం ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి పథకాన్ని ఆమోదించిందని, దీనికి కేంద్రం నుండి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సహకారం అందుతుందని తెలిపారు. కేంద్రం గ్రాంట్-ఇన్ ఎయిడ్గా డ్రగ్ పార్కుకు రూ.1,000 కోట్లు, మెడికల్ డివైస్ పార్కులకు రూ.100 కోట్లు ఇస్తుందన్నారు.
భారీ ప్రోత్సాహకాలు
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ సంబంధిత ప్రోత్సాహకాల స్కీంను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ పార్కుల కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. పీఎల్ఐగా పిలిచే ఈ స్కీం ద్వారా ఫార్మా కంపెనీలకు ఆర్థిక సాయం అందుతుంది. దీంతో కీలకమైన 53 డ్రగ్స్ తయారీకి అవసరమైన ఏపీఐలను మన వద్దే తయారు చేసుకోవచ్చు. ఫర్మంటేషన్ ఆధారిత ఎరిత్రోమైసిన్ వంటివి తయారు చేస్తే సేల్స్ పైన 20 శాతం ప్రోత్సాహకం ఉంటుంది. కెమికల్ సింథసిస్ ఆధారంగా తయారు చేసే పారాసిటిమాల్ వంటి వాటికి 10 శాతం ప్రోత్సాహకాన్ని ఆరేళ్ల పాటు ఇస్తారు. వీటిలో సాల్వెంట్ రికవరీ ప్లాంట్, డిస్టిలేషన్ ప్లాంట్, పవర్ స్టీమ్ యూనిట్స్ వ్యర్థాలను శుభ్రపరిచే ప్లాంట్ వంటివి ఉంటాయి.
ఉత్పత్తి పెరిగి.. ఉద్యోగాలు
పీఎల్ఐ స్కీం అమలు వల్ల మన దేశంలో రూ.46,400 కోట్ల విలువైన డ్రగ్స్ ఉత్పత్తులు పెరుగుతాయని అంచనా. మెడికల్ డివైస్ పార్కును ప్రోత్సహించడం వల్ల దాదాపు రూ.68,437 కోట్లకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ఈ పథకం వల్ల మన దేశంలో గణనీయంగా ఉద్యోగాలు వస్తాయి. తమ రాష్ట్రంలోని భటిండాలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయాలని ఇదివరకే పంజాబ్ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది. తాజాగా, ఈ పార్కుకు సంబంధించి ప్రతిపాదనలు పరిశీలించాలని పంజాబ్ మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ కేంద్రమంత్రి సదానంద గౌడను కలిసి లేఖ ఇచ్చారు.