రాజకీయాలకు చెక్! కో-ఆపరేటివ్ బ్యాంకులపై కేంద్రం అతికీలక నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణ పరిధిలోకి తీసుకు వచ్చింది. అన్ని సహకార బ్యాంకులను ఆర్డినెన్స్ ద్వారా ఆర్బీఐ కిందకు తీసుకు రావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ విషయం తెలిపారు.
చైనా బ్యాంకులకు నేను హామీ ఇవ్వలేదు: అనిల్ అంబానీ షాక్, రుణరహిత సంస్థగా అనిల్ సంస్థ!
దేశంలోని 1540 కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకు రావాలని నిర్ణయించినట్లు జవదేకర్ తెలిపారు. తద్వారా అందులోని రూ.8.6 కోట్ల ఖాతాదారులకు సంబంధించిన రూ.4.84 లక్షల కోట్ల డబ్బుకు భద్రత, భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ బ్యాంకులతో పాటు 1,482 అర్బన్ కోఆపరేటివ్, 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. కొద్ది నెలల క్రితం పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (PMC) సంక్షోభం వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ 1,540 కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకు వచ్చే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపింది.
ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకు వస్తామని ప్రస్తావించారు. అయితే కోరనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు, 2020కు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో ఆమోదం పొందలేదు. కోఆపరేటివ్ బ్యాంకులు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది మంచి నిర్ణయం అంటున్నారు,.