అమెరికా-ఇరాన్ టెన్షన్: బంగారం, ఆయిల్ సహా వీటిపై భారీ ప్రభావం
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, బంగారం, టీ, బాస్మతి సహా ఎన్నో దిగుమతులు, ఎగుమతులపై ప్రభావం పడుతోంది. బంగారం, క్రూడాయిల్ ధర అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనిన నేపథ్యంలో ఓ వైపు కొన్నింటి ధరలు పెరుగుతుంటే, మరికొన్ని మన ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారీగా తగ్గిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం, కారణం ఇదే!
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వరుసగా ఐదు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ 18 పైసలు పెరిగింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ.80.48, డీజిల్ రూ.74.88 వద్ద, అమరావతిలో పెట్రోల్ 15 పైసలు పెరిగి రూ.80.01, డీజిల్ 18 పైసలు పెరిగి రూ.74.07 వద్ద, విజయవాడలో పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి రూ.79.65, డీజిల్ 18 పైసలు పెరిగి రూ.73.73 వద్ద ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పశ్చిమాసియా భయాలు క్రూడాయిల్ మార్కెట్కు ఎక్కువగా ఉన్నాయి.
80 డాలర్లకు బ్రెంట్ క్రూడాయిల్
అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ 80 డాలర్లకు చేరుకోవచ్చునని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ఇటీవల ఏకంగా 4 శాతం పెరిగి 70 డాలర్లకు చేరువైంది. ఇది 80 డాలర్లకు చేరుకుంటుందని అంటున్నారు.
పెరుగుతున్న బంగారం ధర
ఇరాన్ కమాండర్ ఖాసీమ్ను హతమార్చడం, భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు అనిశ్చితిలో ఉన్నారు. దీంతో సురక్షిత సాధనాల వైపు చూస్తున్నారు. దీంతో క్రూడాయిల్తో పాటు బంగారం ధర భారీగా పెరిగింది. ఈ దాడి తర్వాత బంగారం ధర దాదాపు రూ.1500కు పైగా పెరిగింది. నిన్నటి వరకు చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం భయంతో బంగారంపై పెట్టుబడి పెడితే ఇప్పుడు ఇరాన్ - అమెరికా భయంతో పసిడి వైపు చూస్తున్నారు. బంగారం గత వారం దాడుల అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 25 డాలర్లు ఎగిసింది.
మన ఎగుమతులపై ప్రభావం
రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మన ఎగుమతులపై కూడా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా టీ, బాస్మతి పరిశ్రమలు ఆందోళనలో ఉన్నాయి. సీఐఎస్ దేశాల తర్వాత ఇరాన్.. భారత్ నుంచి టీ పొడిని దిగుమతి చేసుకుంటుంది. గత ఏడాది నవంబర్ సీఐఎస్ దేశాలకు 5.28 కోట్ల కిలోల టీ పొడిని ఎగుమతి చేయగా, ఇరాన్కు 5.04 కిలోలు ఎగుమతి చేసింది భారత్. ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశముంది.
బాస్మతి ఎగుమతులు నిలిపివేత
ఇరాన్లో పరిస్థితులు చక్కబడే వరకు బాస్మతి బియ్యం ఎగుమతులను నిలిపేయాలని ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఎగుమతిదారులకి సూచించింది. అక్కడకు పంపించే బియ్యం ఎగుమతులకు ఏమైనా జరిగితే దేశీయంగా రైతులపై, బియ్యం ధరలపై ప్రభావం పడుతుందని తెలిపింది. గత క్వార్టర్లో భారత్ రూ.32,800 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో రూ.10,800 కోట్ల బాస్మతి ఇరాన్కు ఎగుమతి చేసింది భారత్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రూ.17,700 కోట్ల విలువైన రూ.23.64 లక్షల టన్నుల బాస్మతి ఎగుమతి చేయగా ఇందులో రూ.4,500 కోట్ల ఎగుమతులు ఇరాన్కు వెళ్లాయి.