ధరలకు అలవాటు పడాలి.. బంగారంపై కరోనా భారీ దెబ్బ
భారత్లో గోల్డ్ డిమాండ్ డిసెంబర్ త్రైమాసికంలో పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి, ఆర్థిక మందగమనంకు తోడు ధరలు భారీగా పెరగడంతో దేశంలో గత ఆరు నెలలుగా బంగారం డిమాండ్ పడిపోయింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 30 శాతం క్షీణించి 86.6 టన్నులకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 123.9 టన్నులుగా ఉంది.
ఆభరణాల గిరాకీ 48 శాతం క్షీణించి 52.8 టన్నులుగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామని WGC ఇండియన్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర సోమసుందరం అన్నారు.
ఈ కార్డుతో ఉచితంగా లేదా తక్కువ ధరకే రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు!
బంగారం ధరలకు అలవాటు పడేందుకు సమయం
2020 క్యాలెండర్ ఏడాది చివరి నాటికి బంగారం డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందని, పెళ్లిళ్ల సీజన్, దీపావళి, ధన్ తెరాస్ వంటి పండుగల నేపథ్యంలో రిటైల్ వ్యాపారం పుంజుకోవచ్చునని అన్నారు. ఇప్పటికే దసరా పర్వదినం సమయంలో జ్యువెల్లరీ షాప్లకు కాస్త తాకిడి కనిపించిందని, అమ్మకాలలో మెరుగుదల ఉందని తెలిపారు.
అయితే డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గత ఏడాది (194.3 టన్నులు) కంటే డిమాండ్ తక్కువే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ధరలు భారీగా పెరిగాయని, ఈ ధరలకు ప్రజలు అలవాటు పడేందుకు కాస్త ఇబ్బందికరంగా మారిందని, అలవాటుకు సమయం పడుతుందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో పసిడి రూ.40వేలకు దిగువన ఉంది. ఇప్పుడు రూ.50వేలకు పైగా ఉంది. అయితే ఇప్పటికే నెల రోజులుగా స్థిరంగా ఉండటంతో అలవాటు పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.
రియల్ డౌన్.. బంగారం వైపు క్యాష్ హోల్డర్ల మొగ్గు
2020లో మొదటి మూడు త్రైమాసికాల్లో బంగారం డిమాండ్ 49 శాతం మేర తగ్గి 252.4 టన్నులకు పరిమితమైంది. మొత్తం బంగారం వినియోగం పడిపోగా, గోల్డ్ కాయిన్స్, బార్స్ డిమాండ్ 51 శాతం మేర పెరిగింది. పెరుగుతున్న ధరలు పెట్టుబడిదారులను ప్రాఫిట్ కోసం ఆకర్షించినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ మందగమనం... పెరుగుతున్న బంగారం ధరలు తమ నగదును బంగారంలోకి మార్చడం ప్రయోజనకరమని నగదు ఉన్నవారు (క్యాష్ హోల్డర్లు) భావించారు. సెప్టెంబర్ త్రైమాసికంలో స్క్రాప్ గోల్డ్ సరఫరా 41.5 టన్నులకు పెరిగింది. ఏడేళ్లలో ఇది అత్యధికం.
వేగంగా పెరిగిన ధరలు
కరోనా, లాక్ డౌన్, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వల్ల ధరలు వేగంగా పెరగడంతో పసిడి డిమాండ్ తగ్గిందని సోమసుందరం అన్నారు. సాధారణంగా జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో పెళ్లిళ్లు, పండుగల వల్ల డిమాండ్ ఉంటుందని, ఈసారి కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయని, పండుగలు అంతంతగానే జరిగాయని తెలిపారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కారణాలతో వినియోగదారులు బంగారం రిటైల్ దుకాణాలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు.