కారు నుండి రైల్వేస్, ట్యాక్స్ వరకు.. భారత్ ఎకనమిక్ రికవరీ!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందా? అంటే డేటా అవుననే అంటోంది. సెప్టెంబర్ నెలలో వాహనాల సేల్స్ పెరిగాయి. ప్రభుత్వానికి జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఎనిమిదేళ్ల గరిష్టాన్ని తాకింది. ఆటో సేల్స్, జీఎస్టీ కలెక్షన్లు సూచీలు ఆర్థిక వ్యవస్థకు గుడ్న్యూస్ చెప్పాయి. పండుగ సీజన్ ప్రారంభానికి ముందే ఇటివలి వరకు కుదించుకుపోయిన వివిధ రంగాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే కొన్ని రంగాలు మాత్రం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు 82 శాతం క్షీణతను నమోదు చేశాయి. ప్రధానంగా హాస్పిటాలిటీ, హోటల్స్, విమానయాన రంగం పుంజుకోవాలి.
గుడ్న్యూస్: అదరగొట్టిన మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్
ఏడు నెలల గరిష్టానికి...
కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ నుండి భారీగా క్షీణతను నమోదు చేస్తున్న జీఎస్టీ కలెక్షన్లు సెప్టెంబర్లో పెరిగాయి. దాదాపు ఆరు నెలల తర్వాత.. గత ఏడాదితో పోలిస్తే కలెక్షన్లు పెరుగుదలని నమోదుచేశాయి. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. జీఎస్టీ కలెక్షన్ల పెరుగుదల ఆర్థిక రికవరీకి సంకేతంగా భావించవచ్చు. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఆగస్ట్ నెలలో రూ.86,449 కోట్లు కాగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే ఈసారి వసూళ్లు 4 శాతం (రూ.91,916 కోట్లు) పెరగడం గమనార్హం. వసూళ్లు ఏడు నెలల గరిష్టాన్ని తాకాయి.
పెరిగిన ఆటో సేల్స్
వాహనాల సేల్స్ కూడా భారీగా పెరిగాయి. సెప్టెంబర్లో మారుతీ సుజుకీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 30.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 1.22 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. డొమెస్టిక్ సేల్స్ 32.2 శాతం పెరిగి 1.52 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. 2019 సెప్టెంబర్ మాసంలో 1.15 లక్షల యూనిట్లుగా ఉంది. ఎగుమతులు 9 శాతం పెరిగాయి. డొమెస్టిక్ పాసింజర్స్ వెహికిల్ సేల్స్ 33.9 శాతం పెరిగి గతేడాది 1.10 లక్షలు కాగా, ఈసారి 1.47 లక్షల యూనిట్లుగా ఉంది.
ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ నెలలో మారుతీ సుజుకీ సేల్స్ 30.8 శాతం, హ్యుండాయ్ సేల్స్ 3.8 శాతం, బజాజ్ ఆటో 10 శాతం, టీవీఎస్ మోటార్స్ 14 శాతం, హీరో మోటో కార్ప్ 16.9 శాతం, కియా మోటార్స్ 147 శాతం, హోండా టూవీలర్స్ 8.48 శాతం పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 1.3 శాతం, టయోటా కిర్లోస్కర్ సేల్స్ 20.45 శాతం క్షీణించాయి. మొత్తంగా ఒకటి రెండు మినహా అన్ని ఆటో కంపెనీల సేల్స్ పెరిగాయి.
రైల్వేస్ బ్యాక్..
- పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) సూచీ కూడా ఆర్థిక రికవరీ దిశగా ఆశలు పెంచింది. సామాజిక దూరం కారణంగా ఉద్యోగ సూచీ అస్పష్టంగా ఉంది. సెప్టెంబర్ నెలలో పీఎంఐ 56.8కు పెరిగి ఎనిమిదన్నరేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఆగస్ట్ నెలలో 52గా ఉంది. 50కి పైగా ఉంటే వృద్ధికి సూచీ. 50కి తక్కువగా ఉంటే సంకోచాన్ని సూచిస్తుంది. పీఎంఐ సూచీ 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 35.1 కాగా, రెండో క్వార్టర్లో 51.6గా ఉంది.
- సెప్టెంబర్తో ముగిసిన అర్ధ సంవత్సరంలో సరకు రవాణా 9 శాతం తగ్గి 533 మిలియన్ టన్నులుగా ఉంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 241 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదాయం 31 శాతం పడిపోయి రూ.22,266 కోట్లుగా ఉండగా, ఏప్రిల్-సెప్టెంబర్ అర్ధ సంవత్సరంలో 17 శాతం క్షీణించి రూ.50,168 కోట్లుగా ఉంది. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం 102 మిలియన్ టన్నులతో 15 శాతం (గత ఏడాదితో పోలిస్తే) పెరిగింది. సరకు రవాణా కార్యకలాపాల ద్వారా ఆదాయం 14 శాతం పెరిగి రూ.9,903 కోట్లుగా ఉంది.
పెరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్
యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెలలో 1.61 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఉండగా, సెప్టెంబర్ నాటికి 1.8 బిలియన్లకు పెరిగింది. ట్రాన్సాక్షన్ వ్యాల్యూ ఆగస్ట్లో రూ.2.98 ట్రిలియన్లు కాగా, సెప్టెంబర్ నాటికి రూ.3.3 ట్రిలియన్లకు పెరిగింది. జనవరి నుండి మార్చి వరకు వ్యాల్యూపరంగా ప్రతి నెల 1.3 బిలియన్లు వరకు ఉండగా, ఏప్రిల్లో 0.99 బిలియన్లకు తగ్గింది. వ్యాల్యూమ్ పరంగా మేలో 1.23 బిలియన్లు, జూన్లో 1.33 బిలియన్లు, జూలైలో 1.49 బిలియన్లు ఉన్నాయి. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ క్రమంగా పెరుగుతున్నాయి.
కొత్త ప్రాజెక్టుల్లో క్షీణత
సెప్టెంబర్ క్వార్టర్లో కొత్త ప్రాజెక్టుల్లో మాత్రం క్షీణత కనిపించింది. ప్రాజెక్టు ట్రాకర్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈసారి 81.9 శాతం క్షీణించి రూ.0.59 ట్రిలియన్లకు తగ్గింది. జూన్ త్రైమాసికం రూ.0.69 ట్రిలియన్లతో చూసినా 14.5 శాతం క్షీణించింది.