కరోనా సమయంలో భారత్లో పెరిగిన మహిళా నియామకాలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్లో మహిళా నియామకాలు పెరిగాయని లేబర్ మార్కెట్ అప్డేట్ నివేదికలో లింక్డిన్ పేర్కొంది. దీని ప్రకారం వివిధ రంగాల్లో మహిళల నియామకాలు ఏప్రిల్ నెలలో 30 శాతం ఉండగా, జూలై చివరి నాటికి 37 శాతానికి పెరిగింది. దేశంలో నియామకాలు కూడా పుంజుకుంటున్నాయని, అలాగే లింగ వివక్ష తగ్గిందని తెలిపింది. కరోనా భయాలు కొనసాగుతుండటం, ఆర్థిక కార్యకలాపాల అస్థిరత, వృద్ధి బలహీనతల నేపథ్యంలో మున్ముందు నియామకాలు మరింతగా పుంజుకునే అవకాశాలు అంతగా లేవని పేర్కొంది.
ఈ మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మహిళల నియామకాలు తగ్గాయని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏప్రిల్ నెలలో భారీగా తగ్గాయని తెలిపింది. అయితే జూన్, జూలై మాసాల్లో క్రమంగా పుంజుకున్నట్లు వెల్లడించింది. అయితే భారత్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఏప్రిల్ నెల నుండే మహిళా నియామకాలు పెరుగుతూ వచ్చాయని తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం లింగ వివక్ష తగ్గడానికి ప్రధానంగా దోహదం పడిందని తెలిపింది.
దాదాపు అన్ని కీలక రంగాల్లో పురుషులతో సమానంగా మహిళా నియామకాలు కనిపించాయని తెలిపింది. కార్పోరేట్ సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో మహిళా ప్రాతినిథ్యం 8 శాతం పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది. వినియోగ వస్తువులు, ఆర్థికం, తయారీ, ఐటీ రంగాల్లో మహిళా ప్రాతినిథ్యం 4 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది.