తెలంగాణలో భారీగా పెరిగిన EV సేల్స్, కారణాలివే: ట్యాక్స్ మినహాయింపుతో..
కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే వాహనాల విక్రయంపై ప్రజలకు ఆసక్తి తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2019 ఏడాదితో పోలిస్తే 2020లో ఈ ఎనిమిది నెలల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ 23 శాతం పెరిగాయి. రీజినల్ ట్రాన్సుపోర్ట్ అథారిటీ(RTA) డేటా ప్రకారం ఆగస్ట్ 6వ తేదీ నాటికి 11,000 ఎలక్ట్రిక్, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఇందులో 6,000 ఎలక్ట్రిక్ కార్లు, 4,000 ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఉన్నాయి. 2019లో ఇదే కాలంలో 9,303 వాహనాలు సేల్ అయ్యాయి. ఇందులో 5,573 ఎలక్ట్రిక్ కార్లు, 3,690 ఎలక్ట్రిక్ టూవీలర్స్, 40 ఆర్టీసీ పాసింజర్ వెహికిల్స్ ఉన్నాయి. ఈ ఏడాది కరోనా మహమ్మారి అన్ని రంగాలు సహా ఆటో విక్రయాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఎలక్ట్రిక్ వెహికిల్ సేల్స్ మాత్రం పెరిగాయి.
ఆర్థికవ్యవస్థకు ఈ మూడు చేయండి: మోడీకి మన్మోహన్ కీలక సూచనలు
అందుకే కొనుగోలు చేస్తున్నారు
కార్బన్ ఉద్గారాల వాహనాల విక్రయాలు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా ఈ-వాహనాలు కొనుగోలు చేస్తే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ఉంది. దీనికి తోడు మిగతా వాహనాలతో పోలిస్తే కాస్త తక్కువ ఖర్చుతో వాహనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన కారణం ఇదే.. గాలి నాణ్యత పెరుగుతుంది
ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేటును గత ఏప్రిల్ నెలలో 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆకర్షణీయ రాయితీలు, కొనుగోలు కాస్ట్ కూడా మిగతా వాటితో పోలిస్తే కాస్త అఫొర్డబుల్గా ఉండటంతో పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఈటీఓ మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిజూ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సేల్ పెరిగితే గాలి నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇది ఎంతో అవశ్యమని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మున్ముందు ఎక్కువమంది వీటివైపు మొగ్గు చూపేందుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో కొత్త పాలసీ
ప్రభుత్వం ఇటీవల తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని ఆమోదించింది. తద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులను, కొనుగోలుదారులను ప్రోత్సహించేలా ఈ పాలసీని రూపొందించారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు పైకి వచ్చే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కచ్చితంగా పెరుగుతుదని, ఇది సాధారణ వృద్ధి అయినప్పటికీ, ఈ పెరుగుదల వెనుకగల కారణాలను అధ్యయనం చేయాల్సి ఉందని జాయింట్ ట్రాన్సుపోర్ట్ కమిషనర్ సీ రమేష్ అన్నారు. 100 శాతం రోడ్ ట్యాక్స్ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి ప్రోత్సాహకాలు కూడా మరింతమంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.