loan apps: Razorpay సహా పలు సంస్థలపై ED ఛార్జిషీట్.. కమీషన్ల కోసం చైనా యాప్లతో కుమ్మక్కై..
loan apps: దేశంలో లోన్ యాప్ లు సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. చైనా మూలాలున్న వీటి కట్టడిలో భాగంగా కొన్నింటిపై భారత ప్రభుత్వం నిషేదం విధించిన విషయం విధితమే. జాతీయ భద్రత పేరిట మరికొన్నింటి కార్యకలాపాలను ఇండియా అడ్డుకుంది. అయితే కొన్నిలెండింగ్ యాప్ లపై కేసులు నమోదు చేసినట్లు తాజాగా ED ప్రకటించింది.
చైనా యాప్లు, NBFCలు:
రేజర్ పే సహా మరో 3 ఫిన్ టెక్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) శుక్రవారం వెల్లడించింది. చైనీయుల నియంత్రణలో ఉన్న యాప్లతో పాటు పలు NBFCలు సైతం ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. రుణాల పేరిట ఆయా యాప్ లు పలు మోసాలకు పాల్పడినట్లు వినియోగదారుల నుంచి వీటిపై గతంలో ఫిర్యాదులు అందినట్లు గుర్తు చేసింది.
బెంగళూరులో ప్రాసిక్యూషన్:
మొత్తం 7 సంస్థలతో పాటు ఐదుగురు వ్యక్తులను నిందితులుగా ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు ED వెల్లడించింది. చైనీయులచే నడపబడుతున్న పలు కంపెనీలు సహా RBI వద్ద రిజిస్టర్ కాబడిన మరో 3 ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టం చేసింది. బెంగళూరులోనిప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA) కోర్టు వీరిని ప్రాసిక్యూట్ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది.
యాప్లతో కుమ్మకైన NBFCలు:
రుణాల పంపిణీ కోసం ఈ డిజిటల్ లెండింగ్ యాప్ లు సంబంధిత NBFCలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు ED వివరించింది.
ఈ ఫిన్ టెక్ కంపెనీలు మనీ లెండింగ్ వ్యాపారాన్ని చట్టవిరుద్ధంగా, RBI నియమావళి విరుద్ధంగా నిర్వహిస్తున్నాయని పేర్కొంది. ఇది తెలిసీ తమ కంపెనీ పేరు వినియోగించుకోవడానికి ఆయా NBFCలు అనుమతించినట్లు గుర్తించామని వెల్లడించింది. తద్వారా వాటి నుంచి కమీషన్లు పొందినట్లు తెలిసిందని చెప్పింది.