Ecom Express: విజయవాడ సహా మెట్రో నగరాల్లో 30,000 ఉద్యోగాలు
లాజిస్టిక్ సేవల సంస్థ ఈ-కామ్ ఎక్స్ప్రెస్ 30,000 మంది సీజనల్ ఉద్యోగుల్ని నియమించుకోనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ ఆర్డర్స్ భారీగా పెరిగాయి. ఇప్పుడు పండుగ సీజన్ వస్తోంది. దీంతో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వేలాది మందిని తాత్కాలికంగా నియమించుకోవాలని నిర్ణయించింది. పండుగ సీజన్ కారణంగా డిమాండును అందిపుచ్చుకోవడానికి డెలివరీ సెంటర్లు, ఇతర విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. పండుగ సేల్ను దృష్టిలో పెట్టుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్ర, ఏజియో వంటి సంస్థలు ఫెస్టివెల్ సేల్స్ ప్రకటించాయి.
రూ.9 లక్షల కోట్లు దాటిన TCS మార్కెట్ క్యాప్, HCL టెక్ రికార్డ్ గరిష్టం
విజయవాడ సహా పలు నగరాల్లో ఉద్యోగాలు
ఈకామ్ ఎక్స్ప్రెస్ తాజాగా చేపట్టనున్న నియామకాలు తెలుగు రాష్ట్రాల్లోను ఉన్నాయి. అహ్మదాబాద్, సూరత్, విజయవాడ, చండీగఢ్, ఇండోర్, పాట్నా, లక్నో,కాన్పూర్, భోపాల్, జైపూర్ తదితర మెట్రో నగరాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇందులో ఎక్కువగా డెలివరీ పర్సనల్స్, సార్టింగ్ సెంటర్ అసోసియేట్స్, వేర్ హౌసింగ్ కార్యకలాపాల వర్క్ ఫోర్స్ను తీసుకోనున్నట్లు తెలిపింది. లాజిస్టిక్ సేవల కోసం 2,000కు పైగా ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఈకామ్ ఎక్స్ప్రెస్ తెలిపింది.
30,000 మంది తాత్కాలికం.. కొంతమంది శాశ్వతం
'ఈకామ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 30,000 మంది సీజనల్ ఉద్యోగులను నియమించుకుంటుంది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ సెంటర్లు, డెలివరీ సెంటర్లలో నియామకాలు ఉంటాయి' అని ఓ ప్రకటనలో తెలిపింది. పండుగ సమయంలో ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుందని, డోర్ స్టెప్ డెలివరీకి ప్రాధాన్యతకు కంపెనీ సన్నద్ధమవుతోందని తెలిపింది. ప్రస్తుతం 30,000 మందిని తాత్కాలికంగా నియమించుకోవడంతో పాటు పండుగ సీజన్ అనంతరం కొంతమందిని పర్మినెంట్ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. గత కొన్నాళ్లుగా పండుగ సీజన్ సమయంలో తీసుకుంటున్న ఉద్యోగుల్లో 30 శాతం మందిని పర్మినెంట్ చేస్తున్నారని చెబుతున్నారు.
విస్తరణ..
ఈకామ్ ఎక్స్ప్రెస్ జూన్, జూలై మధ్య 7000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. సరఫరా గొలుసును కొనసాగించేందుకు, సురక్షిత, సమయానుకూల డెలివరీ కోసం వీరిని నియమించుకుంది. ప్రస్తుతం ఫెస్టివెల్ డిమాండ్ నేపథ్యంలో కంపెనీ లక్షల స్క్వేర్ అడుగుల విస్తీర్ణాన్ని సిద్ధం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబై, బెంగళూరు, విజయవాడల్లో ఉత్పత్తులను స్టోర్ చేసేందుకు విస్తీర్ణం పెంచుకున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతాల్లో విస్తరణతో పాటు దేశంలో 200 డెలివరీ కేంద్రాలను జత చేసింది. అండమన్ నికోబర్ దీవుల్లోకి ప్రవేశించింది. తద్వారా డెలివరీ కేంద్రాలను 3000కు పైగా చేరాయి. ఈకామ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు 27,000కు పైగా పిన్ కోడ్లకు విస్తరించింది.