రూ.300 కోట్ల నుండి రూ.7,000 కోట్లు టార్గెట్.. ఈ స్టార్టప్లో ఏకంగా 5,000 కొత్త ఉద్యోగాలు
కరోనామహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు, వేతనాలు తగ్గుతాయనే ఆందోళనలు తెలిసిందే. అయితే కొన్ని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను చేర్చుకుంటామని చెబుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ స్టార్టప్ డీల్షేర్ ఈ ఏడాది చివరివరకు (డిసెంబర్) వేలాదిమంది కొత్త ఉద్యోగులను తీసుకుంటామని చెబుతోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ప్రకటన చేసింది.
భారత్ 'ప్రతీకార' దెబ్బ: మనమే నష్టపోతున్నాం, GSP హోదాపై దిగివస్తున్న అమెరికా
ఈ ప్రాంతాల్లో, ఈ రంగాల్లో ఉద్యోగాలు
రాజస్థానం, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలలో ఎక్కువగా బిజినెస్, వేర్హౌస్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని 25 నగరాల్లో తాము కొత్తగా 5,000 మందిని కొత్తగా చేర్చుకుంటామని, డిసెంబర్ నాటికి వీరిని తీసుకుంటామని తెలిపింది. వేర్ హౌస్, వస్తు సరఫరా, టెక్నాలజీ విభాగాల్లో ఉపాధి కల్పిస్తామని ఈ స్టార్టప్ వెల్లడించింది. ప్రస్తుతం నెలవారీగా చూస్తే ఈ సంస్థ మంచి వృద్ధి సాధిస్తోంది. ప్రతి నెల దాదాపు 25 శాతం బిజినెస్ను పెంచుకుంటోంది.
వారే టార్గెట్
నెలకు రూ.25,000 నుండి రూ.50,000 ఆర్జిస్తూ దగ్గరలోని కిరాణా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేసే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఆదాయ వర్గీయులకు సేవలు అందించడమే తమ ధ్యేయమని డీల్షేర్ వ్యవస్థాపకులు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ సౌజేంద్రు మెద్దా అన్నారు. నెలకు 25 శాతం వృద్ధితో సాగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 300 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.
100 నగరాలకు చేరువ
ఈ-కామర్స్ బిజినెస్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రానున్న రెండు మూడు నెలల్లో రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలలో 3,000 మందిని కొత్త ఉద్యోగులను చేర్చుకుంటామని, డిసెంబర్ నాటికి 5,000 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంటామని చెప్పారు. డిసెంబర్ నాటికి 100 నగరాలకు చేరువ కావాలని చూస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులతో పాటు సరసమైన ధరలకు అందించే వారిని ప్రోత్సహిస్తుందని, ఇది కస్టమర్లకు కూడా ప్రయోజనమన్నారు.
రూ.300 కోట్ల నుండి రూ.7,000 కోట్లకు..
డీల్ షేర్ స్టార్టప్ 400 మ్యానుఫ్యాక్చరర్స్, 300 లోకల్ ప్రొడ్యూసర్స్తో టయ్-అప్ అయింది. డిసెంబర్ నాటికి 1000 మ్యానుఫ్యాక్చరర్స్తో టయ్-అప్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 నాటికి గ్రాస్ మర్చంటైజ్ వ్యాల్యూ (GMV) రూ.7,000 కోట్ల వరకు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.300 కోట్లుగా ఉంది. రోజుకు సగటున 25,000 ఆర్డర్స్ డెలివరీచేస్తోంది.