జీడీపీ పతనం ఊహించినట్లే - ఇప్పటికే మనం V-షేప్ రికవరీలో ఉన్నాం - సీఈఏ సుబ్రమణియన్
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు దాదాపు పూర్తిగా నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలోనే భారీ క్షీణత నమోదైంది. అయితే, ఈ పతనం సరిగ్గా ఊహించిన స్థాయిలోనే ఉందనిప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) కేవీ సుబ్రమణియన్ అన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా నమోదైందంటూ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించిన తర్వాత సీఈఏ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా సాగాయి కాబట్టే జీడీపీ తగ్గిందని, కాగా, లాక్ డౌన్ విధించిన ఇండియాతోపాటు విదేశాల్లోనూ దాదాపు ఇలాంటి క్షీణతే నమోదైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.
2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంటే, జూన్ తర్వాత కేంద్రం అన్ లాక్ ప్రక్రియను చేపట్టిందని, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అనేక సడలింపులు ప్రకటించిన దరిమిలా భారత్ ఇప్పటికే కోలుకుంటున్నదని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారు. ''లాక్ డౌన్ సడలింపులు ప్రకటించినప్పటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగవుతోంది. ఇప్పటికే మనం V-షేప్ రికవరీ దశలో పయనిస్తున్నాం''అని సుబ్రమణియన్ అన్నారు.
లాక్ డౌన్ అనంతరం కొన్ని ప్రధాన రంగాల్లో మెరుగైన గణాంకాలు నమోదవుతున్నాయని, రైల్వేలో రవాణా మళ్లీ ఊపందుకుందని, దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, ఈ-వే బిల్లుల జనరేషన్ సైతం పెరిగిందని, ఇవన్నీ రికవరీకి సంకేతాల్లాంటివేనని సుబ్రమణియన్ పేర్కొన్నారు. జీడీపీ పరంగా ఇండియాతో సమానంగా ఉండే యూకేలో సైతం జీడీపీ 22 శాతం పతనం నమోదైందని ఆయన గుర్తుచేశారు.