72 గం.ల్లో అడిగింది ఇవ్వాల్సిందే.. లేదంటే పెనాల్టీ! ఈ కామర్స్ కంపెనీలకు కొత్త మార్గనిర్దేశకాలు
దేశంలో ఈ కామర్స్ కంపెనీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గనిర్దేశకాలను రూపొందించింది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని సరళతరం నిబంధనలను కఠినతరం చేసింది. అదే సమయంలో విదేశీ సంస్థలకు, స్వదేశీ సంస్థలకు తేడా చూపకుండా అన్నిటికీ ఒకే పాలసీ వర్తించేలా జాగ్రత్తలు తీసుకుంది. వినియోగదారుల డేటా సమీకరణ, స్టోరేజ్ కి సంబంధించి కూడా మెరుగైన నిబంధనలు రూపొందించింది.
ఈ కామర్స్ రంగ విస్తృతిని పెంచేలా కొత్త నియమావళి ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ మోడల్స్ లో పనిచేసే కంపెనీలు, వాటి కి సంబంధించిన కార్యకలాపాల ఆధారంగా వాటిని కూడా ఈ కామర్స్ సంస్థలుగా పరిగణించేలా రూల్స్ ఉండబోతున్నాయి. గతంలో కేవలం వస్తువులు, సేవలను నేరుగా ఆన్లైన్ లో విక్రయిస్తే లేదా పంపిణీ చేస్తే మాత్రమే దానిని ఈ కామర్స్ కంపెనీగా గుర్తించే వారు. ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ ప్రకటనలు, లేదా కంటెంట్ విక్రయాన్ని కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కొన్ని సంస్థలకు కొత్త చిక్కులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే ఈ కామర్స్ రంగంలో పనిచేస్తున్న సంస్థలకు మాత్రం ఇవి కొంత ఊరట నిచ్ఛేలా ఉన్నాయి.
కరోనాతో వీటి విలువ పెరిగింది, ఆర్బీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించడమా!: HDFC పరేఖ్
లేదంటే అంతే...
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) ఆమోదం తర్వాత ఈ కామర్స్ కొత్త చట్టం చేసేలా చర్యలు తీసుకుంటారు. కొత్త నియంత్ర సంస్థ కూడా ఏర్పాటవుతుంది. గతంలో డేటా లోకలైజెషన్ కు అధిక ప్రాధాన్య మిచ్చిన కేంద్రం... ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థల ను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన 72 గంటల్లో ఏ సమాచారాన్ని అయినా సరే సమర్పించాల్సిందే. లేదంటే భారీగా పెనాల్టీ విధిస్తారు. దీంతో అటు విదేశీ కంపెనీ అయినా... ఇటు స్వదేశీ కంపెనీ ఐన ఒకేలా నిబంధనలు వర్తిస్తాయి. దేశ సమగ్రత, భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇలాంటి కఠినతరమైన నియమావళి రూపొందించినట్లు సమాచారం. ఇందులో కేంద్రం రూపొందించిన కొత్త ఈ కామర్స్ విధానానికి సంబంధించిన విధివిధానాలను ప్రస్తావించింది.
అన్నీ అందులోకి...
బిజినెస్ టూ కన్స్యూమర్ (బీ2సి), బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ), ఐఓటి లేదా సమాచార పంపిణీ (షేరింగ్) ఇలా ఏదైనా సరే కొత్త ఈ కామర్స్ విధానం పరిధి లోకి రానుంది. అదే సమయంలో ఈ కామర్స్ రంగంలో పనిచేసే వివిధ సంస్థలకు సంబంధించిన కార్యకలాపాల ఆధారంగా వాటి సమాచారాన్ని ఎక్కడ భద్ర పరచాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. గతంలో లాగా డేటా ను కేవలం ఇండియాలోనే భద్రపరచాలన్న నిబంధనలు కొంత సడలించినట్లుగా కనిపిస్తోంది. కానీ, డేటా ఎక్కడ స్టోర్ చేసినప్పటికీ దానిని అడిగిన వెంటనే సమర్పించేలా నిబంధనలు రూపొందించింది. ఇది బడా కంపెనీలకు కూడా కలిసివచ్చే అంశమే. మరోవైపు 18 సంవత్సరాలు నిండని వారితో కంపెనీలు అగ్రిమెంట్లు కుదుర్చుకోవటం కుదరదు. కాబట్టి, వారికి నిబంధలు వర్తించవు.
అమెజాన్, పేస్ బుక్, యూట్యూబ్ లకు మేలు...
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఈ కామర్స్ విధానానికి సంబంధించిన నియమావళి విదేశీ సంస్థలైన అమెజాన్, పేస్ బుక్, యూట్యూబ్ వంటి కంపెనీలకు మేలు చేయనున్నాయి. గతంలో వాటిని డేటా కేవలం ఇండియా లో నే భద్రపరచాలన్న నిబంధన పెట్టారు. దాంతో వెంటనే ఇండియా లో డేటా సెంటర్ల ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు అలా కాకుండా... డేటా ఎక్కడ ఉన్నా సరే అడిగిన వెంటనే సమర్పిస్తే చాలు అనే నిబంధన వాటికి వరంలా మారిపోయింది. అయితే పౌరుల ఆరోగ్య రికార్డులు, డిఫెన్స్ కు సంబంధించిన సమాచారం, సున్నితమైన, దేశ భద్రతకు సమందించిన సమాచారం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా విదేశాల్లో స్టోర్ చేసేందుకు వీలులేదు.