చైనా అవసరం లేదు.. చైనా పెట్టుబడులూ అవసరం లేదు.. మనకూ సత్తా ఉంది
సరిహద్దులో చైనా ఉద్రిక్తతలు తలెత్తేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘాటుగానే స్పందిస్తోంది. 59 చైనీస్ కంపెనీల యాప్స్ను నిషేధించింది. రోడ్స్ నిర్మాణంలో చైనా కంపనీలను పక్కన పెడతామని తెలిపింది. పవర్ సెక్టార్కు కావాల్సిన వస్తువులను పాకిస్తాన్, చైనా నుండి దిగుమతి చేసుకోవద్దని రాష్ట్రాలకు లేఖ రాస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఒప్పందాలు జరిగినా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఏకంగా శుక్రవారం లడక్లో పర్యటించి విస్తరవాదానికి కాలం చెల్లిందని చైనాకు ఘాటు హెచ్చరికలు పంపించారు. తాజాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చైనా వస్తువులు, దిగుమతులపై స్పందించారు.
చైనా దూకుడుపై భారత్ ధైర్యం... సూపర్: 59 యాప్స్ నిషేధంపై నిక్కీ హేలీ ప్రశంస
చైనా అవసరం లేదు... చైనా వస్తువులూ అవసరం లేదు
రోడ్స్ అండ్ హైవేస్ నిర్మాణం వేలంలో మన కంపెనీలకు అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలు సులభతరం చేస్తోందని, తద్వారా చైనా పెట్టుబడిదారులపై మద్దతు అవసరం లేకుండా చర్యలు తీసుకుంటోందని నితిన్ గడ్కరీ చెప్పారు. జాయింట్ వెంచర్స్ సహా హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను దూరం పెడతామని ఆయన ఇదివరకే ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి తాము ఓ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో ఓ విధానాన్ని రూపొందిస్తామని, ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక అర్హతల కోసం సడలింపులు జరుపుతున్నట్లు చెప్పారు.చైనా అవసరం లేదు.. చైనా పెట్టుబడులూ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
చైనాకు వివిధ దేశాలు నో.. మనకు ప్రయోజనం
భారత మౌలిక సదుపాయాలు చైనా పెట్టుబడులపై ఆధారపడవద్దని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయని, అంతర్జాతీయంగా చైనాతో డీల్కు ఎక్కువ దేశాలు ఆసక్తిగా లేవని చెప్పారు. చైనాతో డీల్కు వివిధ దేశాలు మొగ్గు చూపడం లేదని, ఇది భారత దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని గడ్కరీ చెప్పారు.
మన కంపెనీలకు సామర్థ్యం ఉంది
భారత్ దిగుమతులపై అధికంగా ఆధారపడటం తగ్గించి, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగాలని గడ్కరీ అన్నారు. పరిశ్రమ కూడా దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలన్నారు. భారతీయ కంపెనీలు మంచి సామర్థ్యం కలిగి ఉన్నాయని, కాబట్టి మనకు చైనా అవసరం లేదు.. చైనా పెట్టుబడులూ అవసరం లేదని చెప్పారు. దీనికి ఏ రాకెట్ సైన్స్ అవసరం లేదని, నాణ్యత విషయంలో రాజీపడకుండా ఓ మార్గం కనుగొంటే చాలునని చెప్పారు. మన భారతీయ పరిశ్రమ ఇప్పుడు తమ టెక్నాలజీ అప్ డేట్ కోసం, ఖర్చు పోటీ తత్వం పెరగాలన్నారు.
ఆటో పరిశ్రమ.. ఆలోచించాలి
మేకిన్ ఇండియాకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందని గడ్కరీ చెప్పారు. ఆటో పరిశ్రమకు ఆయన హామీ ఇచ్చారు. బజాజ్, టీవీఎస్ ఉత్పత్తుల్లో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గుర్తు చేశారు. ఆటో ఇండస్ట్రీ నుండి మేం ఇదే ఆశిస్తున్నామని చెప్పారు. ప్రారంభంలో భారతీయ ఉత్పత్తులు పోటీలో నిలిచినా నిలవకపోయినా క్రమంగా ఉత్పత్తిని ప్రామాణీకరిస్తే, ఉత్పాదకతను పెంచితే పోటీలో నిలబడతామన్నారు. చైనా నుండి ఉత్పత్తి అయ్యే అన్ని ప్రోడక్ట్స్కు భారత ఆటో పరిశ్రమ ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.