మోడీ 5 ట్రిలియన్ డాలర్లు సాధ్యమే కానీ, టెక్నాలజీతో కస్టమర్లకు వడ్డీరేటు తగ్గింపు:ఎస్బీఐ చైర్మన్
ప్రధాని నరేంద్ర మోడీ కలలు కంటున్న 'భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల' స్థాయికి చేరుకుంటుందా? అంటే అవుననే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యమని మోడీ ప్రభుత్వం ప్రకటించగా విపక్షాలు, ఆర్థికవేత్తలు కొంతమంది దీనిని అసాధ్యమని కొట్టి పారేస్తున్నారు. అయితే ఇటీవల ఓ రేటింగ్ ఏజెన్సీ అయిదేళ్లలో కాకపోయినా ఆ తర్వాత మరో రెండేళ్లకు 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవచ్చునని తెలిపింది. తాజాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ అదే చెప్పారు.
రూ.5 లక్షల వరకు బీమా: ఆరోగ్య సంజీవనిలో పాలసీదారు వాటా 5%
5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటాం.. కానీ
భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడం సాధ్యమేనని SBI చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. అందుకు ఎంత సమయం పడుతుందని కచ్చితంగా చెప్పలేమని చెబుతూ, ఎంత త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుతామనేది పెట్టుబడుల సమీకరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయన ఫిక్కీ సారథ్యంలోని చర్చాగోష్టిలో మాట్లాడారు.
ఆ పెట్టుబడులతోనే సాధ్యం కాకపోవచ్చు
ఆశించినస్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడం చాలా ముఖ్యమని రజనీష్ కుమార్ చెప్పారు. కేవలం ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చునన్నారు. 5 ట్రిలియన్ డాలర్లు తప్పక సాధించే లక్ష్యమేనని, ఇందులో సందేహం లేదని, ప్రభుత్వరంగానికి ప్రయివేటు రంగ పెట్టుబడులు జత కలవాలని అభిప్రాయపడ్డారు.
టెక్నాలజీపై హెచ్చరిక.. కస్టమర్లకు టెక్నాలజీ లాభం!
సాంకేతిక నైపుణ్యం విస్తరిస్తోందని, దీనిని అందిపుచ్చుకోని వ్యాపార సంస్థలు పోటీలో వెనుకబడిపోతాయని హెచ్చరించారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ తెస్తున్న మార్పులను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా బ్యాంకులు తమ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆ మేరకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయని, అంతిమంగా అది కస్టమర్లకు ప్రయోజనమని అభిప్రాయపడ్డారు.
నగదు ప్రవాహం ఆధారంగా రుణాలు..
ఎస్బీఐ కార్పొరేట్ కంపెనీల్ని ఖాతాదారులుగా చూడడం లేదని, కార్పొరేట్ ఎకో సిస్టంలో ఒక భాగం కావాలనుకుంటోందని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (MSME) రంగంలో క్రమంగా ఫార్మలైజేషన్ పెరుగుతోందని, దీని వల్ల డేటా అందుబాటులోకి వచ్చి మరింతగా MSMEలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీలవుతోందని చెప్పారు. ఆస్తుల ఆధారంగా రుణాలు ఇచ్చే విధానం నుంచి కంపెనీలకు లభిస్తున్న నగదు ప్రవాహం ఆధారంగా రుణాలివ్వడానికి మొగ్గు చూపుతోందని అన్నారు.