సన్నీలియోన్ నుండి జర్నలిస్ట్ వరకు: తెలియకుండానే రుణ మంజూరు, క్రెడిట్ స్కోర్పై ప్రభావం
ఇటీవలి కాలంలో చాలామంది మనీ లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఇండియాబుల్స్కు చెందిన ధని యాప్ లక్షలాదిమందికి రుణాలు ఇచ్చింది. లోన్ యాప్స్ కస్టమర్లను ఆకర్షించేందుకు జీరో శాతం వడ్డీతో ముందుకు వస్తున్నాయి. అయితే ధని యాప్ ద్వారా చాలామంది కస్టమర్లకు వారికి తెలియకుండానే రుణ పంపిణీ జరగడం గమనార్హం. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గత కొంతకాలంగా పలువురు వినియోగదారులు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తమ పాన్ నెంబర్ మిస్యూజ్ అయిందని, తమకు తెలియకుండానే రుణ పంపిణీ జరుగుతోందని పేర్కొంటున్నారు.
ధని యాప్లో రుణాలు పొందడానికి కస్టమర్ పాన్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ వివరాలు అందివ్వవలసి ఉంటుంది. అయితే, వివిధ సందర్భాల్లో పాన్ కార్డు హోల్డర్లు తమ సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే సమయంలో తమకు తెలియకుండానే రుణ పంపిణీ జరిగినట్లుగా గుర్తించారు. తన పాన్ నెంబర్పై ఉత్తర ప్రదేశ్, బీహార్ చిరునామాలతో రుణ విస్తరణ జరిగిందని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. తనకు తెలియకుండా తన పేరుతో రుణం ఎలా తీసుకుంటారని, ఈ రుణం ఎగవేసినట్లు తన క్రెడిట్ హిస్టరీలో చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బాధితుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సన్నీ లియోన్ నుండి జర్నలిస్ట్ ఆదిత్య వరకు ఉన్నారు. తాము ధని యాప్లో రుణం కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదని, కానీ తన పేరు మీద రుణాలు మంజూరు అయ్యాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.