నందన్ నీలేకని కొత్త రోల్? డ్రోన్స్ రంగంపై బెట్టింగ్!
నందన్ నీలేకని. పరిచయం అక్కరలేని పేరు. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుల్లో ఒకరుగా అందరికీ సుపరిచితుడే. అంతకంటే ఎక్కువగా ఆధార్ కార్డు సృష్టికర్తగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. టెక్నాలజీని అందరికి చేరువ చేయటంపై సదా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు అయన దృష్టి డ్రోన్స్ పైకి మళ్లింది. కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ చేపడుతున్న ఒక డ్రోన్స్ ప్రాజెక్టులో నందన్ నీలేకని పెట్టుబడి పెట్టిన ఒక స్టార్టుప్ కంపెనీ పాల్గొంటుండటంతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బియాండ్ విసువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్ఓఎస్) అనే డ్రోన్ ప్రాజెక్టును డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చేపడుతోంది.
ఇందులో పాల్గొనేందుకు నందన్ నీలేకని కి చెందిన షాప్ ఎక్స్ సంస్థకు కూడా అనుమతి లభించింది. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఆధార్ కార్డు ను అన్ని రకాల ప్రభుత్వ పథకాలతో అనుసంధానించే స్థాయిలో విజయవంతం చేయటంలో నందన్ నీలేకని కృషి అమోఘం అని, 100 కోట్ల మందికి పైగా ఆ కార్డును వినియోస్తుండటం ఒక రికార్డు అని నిపుణులు చెబుతుంటారు. ఆధార్ తో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయన ... ఇప్పుడు డ్రోన్స్ తో ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారా అన్న ఉత్కంఠ నెలకొంది.
హాస్పిటల్ ఖర్చులకు అపోలో-బజాజ్ ఆఫర్: EMI హెల్త్ కార్డ్, ఎలా తీసుకోవచ్చు?
దీర్ఘ శ్రేణి డ్రోన్స్ నడిపే ప్రాజెక్టు...
సహజంగా డ్రోన్స్ ఒక పరిధిలో పనిచేస్తాయి. మహా అంటే కొన్ని కిలోమీటర్ల వరకే వాటిని రిమోట్ తో నియంత్రించే అవకాశం ఉంది. కానీ డ్రోన్స్ ను కూడా విమానాలవలే సుదీర్ఘ దూరాలకు నడపగలిగే వాణిజ్య పరమైన ప్రాజెక్ట్ ను ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోందని సమాచారం. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు ఇప్పటికే స్పైస్ జెట్ కు సంబంధించిన కార్గో సేవల సంస్థ స్పైస్ ఎక్ష్ప్రెస్స్, బెంగళూరు కేంద్రంగా పనిచేసే డెలివరీ స్టార్టుప్ డాంజో, డ్రోన్స్ స్టార్టుప్ ట్రాటిల్ వంటి కంపెనీలకు కూడా అనుమతులు లభించాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మక దశలోనే ఉందని, ఇందుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు మరో 6 నెలల నుంచి 8 నెలల సమయం పడుతుందని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అంబర్ దూబే వెల్లడించారు. అనుమతులు పొందిన కన్సార్టియం లు తమ డ్రోన్ పరీక్షలను (ప్రయోగాలు) నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామని, దానిని బట్టి ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి ఆర్కిటెక్చర్ ను రూపొందిస్తామని చెప్పారు.
హైదరాబాద్ లోనే శిక్షణ ...
డ్రోన్లను నడిపేందుకు కూడా పైలట్ లైసెన్స్ అవసరం. వారికి తగిన శిక్షణ ఇచ్చిన తర్వాతనే డ్రోన్ నడిపేందుకు అనుమతిస్తారు. అయితే, ప్రస్తుతం దేశంలో డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కు పర్మిషన్స్ ఇవ్వటం లేదు కాబట్టి... ఏవియేషన్ శాఖ నే సొంతంగా ఒక పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించనుంది. దీనికి మన హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్ లోని బేగంపేటలో ఫిబ్రవరి 4-5 తేదీల్లో డీజీసీఏ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఇప్పటికే అనుమతి పొందిన సుమారు 30 సంస్థలు ఇందులో పాల్గొనబోతున్నాయి. ఈ కార్యక్రమం తర్వాత దేశంలో మరిన్ని డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అనుమతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి... ప్రభుత్వం కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తుందని, అందుకే కొంత ఆలస్యం జరుగుతోందని సమాచారం.
డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి ...
డ్రోన్ టెక్నాలజీ కి ఇండియాలో అపార అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో అది రిస్క్ తో కూడిన పని అని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అందుకే, ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టు విజయవంతమైతే, ఇక ముందు ఎక్కువ కంపెనీలకు డ్రోన్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా... నందన్ నీలేకని పెట్టుబడి పెట్టిన షాప్ ఎక్స్ అనే కంపెనీ కో ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ శర్మ దీనిపై స్పందించారు. తాము ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీల ను అభివృద్ధి చేస్తున్నామని, మరో 18 నెలల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అయితే, ప్రస్తుత ప్రాజెక్టుపై మాత్రం అయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చూడాలి మరి నందన్ నీలేకని కంపెనీ నుంచి ఎలాంటి డ్రోన్ టెక్నాలజీ రానుందో, అది దేశంలో ఏ మార్పు తీసుకు రాబోతుందో!