కరోనా ఛార్జీలపై ఆస్పత్రులు, ఇన్సూరెన్స్ సంస్ధల మధ్య ప్రతిష్టంభన- నలిగిపోతున్న రోగులు...
దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు వసూలు చేస్తున్న ప్రామాణిక ఛార్జీల విషయంలో ఆస్పత్రులకూ, ఇన్సూరెన్స్ సంస్ధలకూ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మధ్యలో రోగులు నలిగిపోతున్నారు. ఆస్పత్రులు నిర్ణయించిన ధరలకూ, బీమా సంస్ధలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ధరల మధ్య వ్యత్యాసం భారీగా ఉండటం ఈ మొత్తం వ్యవహారానికే ట్విస్ట్గా మారింది. ఇప్పటికే ఆస్పత్రులు వసూలు చేస్తున్న కరోనా ఛార్జీల విషయంలో దేశవ్యాప్తంగా పలు న్యాయస్ధానాల్లో నమోదవుతున్నకేసులతో యాజమాన్యాలకూ సమస్యలు తప్పడం లేదు. అయినా వెనక్కి తగ్గేందుకు ఆస్పత్రులు అంగీకరించడం లేదు.
కరోనా ట్రీట్మెంట్ బిల్లులు భారీగా పెంచేస్తున్నారు... ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆరోపణ!
కుదరని ఏకాభిప్రాయం
దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు వసూలు చేస్తున్న ఛార్జీల జాబితాను తాజాగా ఆస్పత్రుల సమాఖ్య అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా- ఏహెచ్పీఐ ప్రకటించింది. ఇందులో కరోనా చికిత్సలో వివిధ స్ధాయిలో, వ్యాధి తీవ్రత మేరకు వసూలు చేస్తున్న ఛార్జీలు సాధారణ జనానికే కాదు, ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ సంస్ధలు, కోర్టులకు సైతం దిమ్మతిరిగేలా ఉన్నాయి. దీంతో వీటిని అంగీకరించేందుకు బీమా సంస్ధల సమాఖ్య జనరల్ ఇన్యూరెన్స్ కౌన్సిల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అసలు కరోనాకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాని పరిస్ధితుల్లో ఈ ఛార్జీల మోత అసలుకే మోసం తెస్తుందని జనరల్ ఇన్యూరెన్స్ కౌన్సిల్ చెబుతోంది. అయితే ఆస్పత్రులు మాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది.
ఆస్పత్రుల వాదన ఇదీ..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన ఆస్పత్రులు కరోనా చికిత్సకు వసూలు చేస్తున్న ప్రామాణిక ఛార్జీల ఆధారంగా తమ ఛార్జీలు ప్రకటించినట్లు ఏహెచ్పీఐ చెబుతోంది. ఇందులో బెంగళూరు నారాయణ హెల్త్కేర్, కోల్కతాకు చెందిన మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఢిల్లీ భగత్ చంద్ర ఆస్పత్రి వంటి కార్పోరేట్ సంస్ధలు ఉన్నాయి. వీటిలో వసూలు చేస్తున్న ఛార్జీల ఆధారంగా దేశవ్యాప్తంగా తాము వసూలు చేయదగిన ఛార్జీలు, వాటికి కల్పించాల్సిన బీమాపై ఆస్పత్రులు, బీమా సంస్ధలతో ఓ కమిటీ ఏర్పాటైంది. కానీ ఛార్జీల విషయంలో ఆస్పత్రులు వసూలు చేయాలని భావిస్తున్న మొత్తం బీమా సంస్ధల లెక్కలతో పోలిస్తే దాదాపు 70 నుంచి 100 శాతం ఎక్కువగా ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
ఛార్జీల మధ్య భారీ వ్యత్యాసం
ప్రస్తుతం టాప్ 6 ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఛార్జీలు బీమా సంస్ధలు ప్రతిపాదిస్తున్న మొత్తంతో పోలిస్తే భారీగా ఉండటం ప్రతిష్టంభనకు కారణమవుతోంది. ఉదారహణకు ఆక్సిజన్ కేర్తో కూడిన ఐసోలేషన్ బెడ్ల విషయంలోనే వీరిద్దరు ప్రతిపాదిస్తన్న ఛార్జీల మధ్య వ్యత్యాసం రోజుకు పదివేలుగా ఉంది. వెంటిలేటర్తో కూడిన ఐసీయూ చికిత్స విషయంలోనూ ఆస్పత్రులు కోట్ చేసిన మొత్తం రూ.37358 కాగా బీమా సంస్ధలు కోట్ చేసిన మొత్తం రూ. 18 వేలు మాత్రమే. అంటే బీమా సంస్ధలు ప్రతిపాదిస్తున్న మొత్తానికి రెట్టింపు ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయన్నమాట. ఈ లెక్కన ఆస్పత్రిలో సగటు రోగి 14 రోజులు ఉండాలంటే లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.
ఛార్జీల మోతతో రోగులకు చుక్కలు
ఛార్జీల విషయంలో ఆస్పత్రులు, బీమా సంస్ధల మధ్య ప్రతిష్టంభన మరికొంతకాలం తప్పేలా లేదు. దీంతో ఇన్యూరెన్స్ పాలసీలు ఉన్నప్పటికీ రోగులకు చుక్కలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. పరిస్ధితిని బట్టి సెప్టెంబర్లో ఛార్జీల సవరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని బీమా సంస్ధలు చెబుతున్నాయి. కానీ ఆస్పత్రులు మాత్రం తాము వెనక్కి తగ్గేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. దీంతో మరింతకాలం రోగుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకున్నా ఆస్పత్రులు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇన్యూరెన్స్ సంస్ధల మీదే ఎక్కువగా ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.