కరోనా చిక్కులు: మొబైల్ ఆప్ ల కొత్త తిప్పలు.. ఎందుకో తెలుసా?
కరోనా పుణ్యమా అని మొత్తం ప్రపంచ గమనమే పూర్తిగా మారిపోతోంది. చైనా లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి... ప్రపంచ దేశాలను చుట్టేసి గడగడలాడిస్తోంది. ఈ దెబ్బకు ఇది అది అని తేడా లేకుండా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అందరికీ కరోనా తో కొత్త చిక్కులు వచ్చి పడగా... ఇండియా లో ప్రముఖ మొబైల్ ఆప్ లు కలిగిన సంస్థలకు మాత్రం పెద్ద తిప్పలే వచ్చింది.
ఇది ఫ్లిప్ కార్ట్ వంటి అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ మొదలు కొని, చిన్న చిన్న సంస్థల వరకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 40 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. తొలుత 21 రోజులే అనుకున్నారు. తర్వాత మళ్ళీ పెంచారు. కానీ... తోలి లాక్ డౌన్ పీరియడ్ లో ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చింది.
మళ్ళీ ఈ నెల 20 నుంచి తిరిగి ఆపరేషన్స్ మొదలవుతాయి. కానీ, ఇక్కడే ఆయా కంపెనీలకు కొత్త తలనొప్పి వచ్చింది. అదేమిటంటే... వినియోగదారులు ఆయా కంపెనీల మొబైల్ ఆప్ లను డిలీట్ చేయటం మొదలు పెట్టారట. ఎలాగూ ఇప్పుడు సరుకులు దొరకటం లేదు కదా.. మళ్ళీ చూద్దాం లే అని కస్టమర్లు ఇలా చేసే సరికి... కంపెనీలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు.
గ్రీన్కార్డు జారీ 60 రోజులు నిలిపివేత, వేలాది ఇండియన్-అమెరికన్లపై ప్రభావం
గేమ్ లతో ఎంగేజ్
సుమారు నెల రోజులు ఒక్క లావాదేవీ కూడా జరపని వినియోగదారులు సంబంధిత మొబైల్ ఆప్ లను డిలీట్ చేయటం మొదలు పెడుతున్నారట. అందుకు బదులు వేరే గేమ్స్ కానీ, ఎంటర్ టైన్మెంట్ ఆప్ లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన మొబైల్ ఆప్ గా లూడో కింగ్ నిలిచిన విషయం తెలిసిందే.
అలాగే వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలున్న ఆప్ లకు కూడా డిమాండ్ బాగానే ఉంది. ఇదే ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీల కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన కంపెనీలు తమ మొబైల్ ఆప్ లలో కూడా గేమ్స్ ను ప్రవేశ పెట్టి .. తద్వారా వినియోగరులతో ఎంగేజ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఫ్లిప్ కార్ట్ కూడా ఒక అడుగు ముందుకు వేసిందని సమాచారం. గేమ్స్ ఆడితే రివార్డ్ పాయింట్లు సహా అనేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
పేటీఎం లో న్యూస్..
సరిగ్గా ఇదే ట్రెండ్ ను గమనించిన డిజిటల్ పేమెంట్స్ ఆప్... పేటీఎం కూడా తన ఆప్ లో సరికొత్త ఫీచర్ ను జోడించింది. సుమారు 40 - 50 ప్రముఖ పేపర్ల ఈ పేపర్లను చదివే అవకాశం కల్పిస్తోంది. అంతే కాదండోయ్... ఏకంగా లూడో కింగ్ గేమ్ ను కూడా ఆదుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్లే అండ్ విన్ అనే మరో కొత్త ఫీచర్ తో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఇవన్నీ కేవలం ఈ లాక్ డౌన్ సమయంలో వినియోగదారులతో కనెక్టివిటీ ని కలిగి ఉండేందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే వారు మొబైల్ ఆప్ లను డిలేట్ చేసే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. ఒక్కో కంపెనీ ఒక వినియోగదారుని సంపాందించేందుకు సగటున రూ 1,500 నుంచి రూ 2,500 వరకు ఖర్చు చేస్తాయి. ఇక ఒకసారి మొబైల్ ఆప్ నుంచి వైదొలిగితే మళ్ళీ అదే కస్టమర్ ను తిరిగి తమ ప్లాట్ఫారం పైకి తీసుకు రావటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఈ ముందు జాగ్రత్త.
ఫాలో కానున్న మరిన్ని సంస్థలు...
ఈ ట్రెండ్ కేవలం బడా కంపెనీలకే పరిమితం కాలేదు. మరిన్ని సంస్థలు కూడా వీటిని ప్రవేశపెట్టే పనిలో ఉన్నాయి. ఇటీవల ప్రముఖ టిక్కెటింగ్ సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బస్సులు ఇతరత్రా టిక్కెట్లను బుక్ చేసుకునే సేవలు అందించే కంపెనీలు సైతం తమ మొబైల్ ఆప్ లలో గేమ్స్ ప్రవేశపెట్టడం, అందులో గెలిచిన వారికి రివార్డ్ పాయింట్లు, కాష్ బ్యాక్ ఆఫర్లు అందించటం చేస్తున్నాయి.
కోటి విద్యలు కూటి కొరకేనన్నది ఒకప్పటి సామెత. ఇప్పుడైతే దాన్ని తిరగ రాయాలేమో! కరోనా వైరస్ మోసుకొచ్చిన కష్టాలు, సమస్యలను ఎవరూ కనీ వినీ ఉండరని ఇలాంటి సంఘటనలే నిరూపిస్తున్నాయి. ఏ కంపెనీ కూడా తాము చేయని తప్పుకు సుమారు రెండు నెలలు కార్యకలాపాలు నిలిపివేయాల్సి వస్తుందని ఊహించదు కదా. కానీ అది కరోనా వైరస్ పుణ్యమా అని జరిగిపోయింది. దీంతో, కస్టమర్లను కాపాడుకునేందుకు కోటి ప్రయత్నాలు మొదలు పెట్టాయి మన కంపెనీలు.