Crypto crash: బ్యాన్ చేస్తే ఇప్పటికే సర్క్యులేషన్లోని క్రిప్టో పరిస్థితేంటి?
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా క్రిప్టోను నిషేధించవచ్చుననే ఆందోళనల నేపథ్యంలో క్రిప్టో ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే క్రిప్టోను ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం లేదని తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే క్రిప్టో పైన ప్రభుత్వం పూర్తిస్థాయి నియంత్రణ కోరుకుంటోందని తెలుస్తోంది. క్రిప్టో దుర్వినియోగం కాకుండా ఉండేలా రెగ్యులేషన్ మెకానిజం అమలు చేస్తారు. ప్రభుత్వం క్రిప్టో అండర్ గ్రౌండ్ ట్రాన్సాక్షన్స్ పైన ఆందోళన చెందుతోందని, ముఖ్యంగా వీటితో హవాలా మార్గంతో పాటు ఉగ్రవాదులకు నిధులు అందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వీటి నియంత్రణ కోసం బిల్లును తయారు చేస్తోందని చెబుతున్నారు.
దేశంలో కరెన్సీ, పన్ను వ్యవస్థకు క్రిప్టో ప్రమాదకరమని, దీనిని లీగల్ టెండర్గా గుర్తించలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ద్వారా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు చట్ట విరుద్ధమైన లేదా దేశ వ్యతిరేకతకు ఉపయోగించే క్రిప్టో మూలాలను గుర్తించగలిగే యంత్రాంగం అమల్లో ఉంటుంది.
ఆర్బీఐ క్రిప్టో... ప్రయివేట్ నియంత్రణ
క్రిప్టోను నియంత్రణ కోసం క్రిప్టోకరెన్సీ అండ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2021ని కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా ఆర్బీఐ అధికారిక క్రిప్టోను జారీ చేయడానికి సులభమైన ప్రేమ్ వర్క్ను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని టెక్నాలజీ, వినియోగానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు.
శీతాకాల సమావేశానికి ముందు క్రిప్టో కరెన్సీకి సంబంధించి పార్లమెంటరీ కమిటీ భేటీ జరిగింది. క్రిప్టోను ఆపడం కష్టమని, అయితే నియంత్రించాలని అభిప్రాయపడ్డారు.మొత్తానికి క్రిప్టో బ్యాన్ ఉండదని, ప్రభుత్వ రెగ్యులేషన్స్ కఠినంగా ఉండవచ్చునని, హవాలా, టెర్రర్ ఫండింగ్కు అననుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు.
క్రిప్టో పతనం
క్రిప్టో కరెన్సీ రద్దు ఆందోళన కారణంగా బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు తమ చేతుల్లోని క్రిప్టోను విక్రయించి సొమ్ము చేసుకుంటన్నారు. అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఓ సమయంలో 56,000 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 56,500 డాలర్లకు సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఎథేరియం 4281 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
నవంబర్ 29వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అప్పుడు కేంద్రం క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021తో పాటు 26 బిల్లులను లోకసభ ముందు ఉంచనుంది. ఆర్బీఐ గవర్నర్ పలుమార్లు క్రిప్టోపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే క్రిప్టో పైన కేంద్రం కఠిన రెగ్యులేషన్స్ తీసుకు వచ్చే అవకాశం ఉంది.
జెరోదా ఓనర్ ఏమన్నారంటే
క్రిప్టో బిల్లు పైన ఆన్ లైన్ ప్రాఫిట్ బుకింగ్ ప్లాట్ఫామ్ జెరోదా ఓనర్ నిఖిల్ కామత్ స్పందించారు. ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టోను బ్యాన్ చేస్తుందా? ఇప్పటికే సర్క్యులేషన్లో ఉన్న క్రిప్టో పరిస్థితి ఏమిటి? అని అన్నారు. నిఖిల్ కామత్ ప్రశ్నను వట్టినే కొట్టి వేయలేమని అంటున్నారు. భారత్లో 15 మిలియన్ల నుండి 20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నారు. దేశంలో మొత్తం క్రిప్టో హోల్డింగ్ వ్యాల్యూ 40,000 కోట్లు లేదా 5.39 బిలియన్ డాలర్లు.