2019-20 భారత్ వృద్ధి రేటును 6.3 నుంచి 5.1కి తగ్గించిన క్రిసిల్
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత GDP వృద్ధిరేటు అంచనాలను క్రిసిల్ రేటింగ్ తగ్గించింది. అంతకుముందు 6.3% ఉన్న వృద్ధి రేటును తాజాగా 5.1% తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంచనాలకు మించి మందగమన పరిస్థితులు ఉన్నాయని తన తాజా నివేదికలో పేర్కొంది. పారిశ్రామికోత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక స్వల్పకాలిక సూచీలు బలహీన ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది.
జిఎస్టీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, దివాలా కోడ్ వంటిసంస్కరణలు ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయని తెలిపింది. క్రిసిల్ ప్రకటించిన అంచనా జపాన్ బ్రోకరేజీ సంస్త నోమురా ప్రకటించిన 4.7% కన్నా మెరుగ్గా ఉంది. అయితే వివిధ రేటింగ్ ఏజెన్సీలు ప్రకటించిన కనిష్ట స్థాయి అంచనాల్లో ఒకటిగా నిలిచింది.
మోడీ అతిపెద్ద కలకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అడ్డంకి!'
ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 4.75% వృద్ధి రేటు నమోదు అయితే చివరి ఆరు నెలల్లో మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5% నమోదయ్యే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది. ప్రయివేటు వినియోగం, పెట్టుబడుల బలహీనత వంటి పరిస్థితులను చూస్తుంటే డిమాండ్ చాలా వరకు తగ్గినట్లుగా కనిపిస్తోందని తెలిపింది.
అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ మరో నివేదికను విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉంటుందని తెలిపింది. ఊహించిన దాని కంటే మందగమనం కొంత ఎక్కువ కాలమే కొనసాగే అవకాశముందని అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండును దెబ్బతీసిందని పేర్కొంది.