భారత వృద్ధి రేటును 5.2 శాతానికి తగ్గించిన క్రిసిల్
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత వృద్ధి రేటును క్రిసిల్ తగ్గించింది. ఇప్పటికే ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు తగ్గనుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. తాజాగా కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలోను వృద్ధి రేటుపై ప్రభావం పడుతుందని క్రిసిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో 5.7 శాతం అంచనాను 5.2 శాతానికి కుదించింది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ కూడా భారత వృద్ధి రేటును 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 5.1 శాతం నుండి 4.1 శాతానికి తగ్గించింది. వివిధ రేటింగ్ ఏజెన్సీలు గత కొన్నాళ్లుగా భారత వృద్ధి రేటు అంచనాను తగ్గిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా మృతి చెందగా, రెండున్నర లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇందులో 90వేల మంది కోలుకున్నారు. ఇండియాలో 250 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. నలుగురు మృతి చెందారు. కరోనా కారణంగా ప్రపంచ వృద్ధి రేటు భారీగా పడిపోనుంది. ఇందులో భాగంగా ఇండియా వృద్ధి రేటు కూడా తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.