40% ట్యాక్స్: సూపర్ రిచ్కు 'కరోనా' ట్యాక్స్ షాక్, నో చెప్పిన ఆదాయపు పన్ను శాఖ
కరోనా మహమ్మారి నేపథ్యంలో తాత్కాలికంగా ఆదాయం పెంచుకునేందుకు సూపర్ రిచ్ (అధిక సంపద కలిగినవారు) పైన 40 శాతం పన్ను, విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధించాలని కేంద్రానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారులు సూచించారు. ఇది సంచలనంగా మారింది. ఈ అధికారులు ఫోర్స్ పేరుతో ఓ నివేదికను CBDT చైర్మన్ పీసీ మోడీకి సమర్పించింది.
ఐటీ కంపెనీలకు భారీ షాక్, క్లయింట్స్తో సంప్రదింపులకు ఇబ్బందికరమే
సూపర్ రిచ్కు షాక్.. IRS అధికారులు ఏం సూచించారు?
కరోనాపై పోరుకు సూపర్ రిచ్ పైన 40 శాతం పన్నువేయాలని IRS అధికారులు సూచించారు. రూ.1 కోటికి పైగా ఆదాయం కలిగిన వారిపై ప్రస్తుతం అత్యధికంగా 30% పన్ను అమలులో ఉంది. దీనిని 40% పెంచాలని కోరింది. రూ.5 కోట్లు పైబడి ఆదాయాన్ని ఆర్జించే వారిపై తిరిగి సంపద పన్ను ప్రవేశపెట్టాలని సూచించింది. 3 నుండి 6 నెలల కాలానికి ఈ సూచనలు చేసింది.
ఇలా రూ.18వేల కోట్ల ఆదాయం
విదేశీ సంస్థల నుంచి అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని సూచించారు ఈ అధికారులు. పన్ను సహిత ఆదాయం రూ.10 లక్షలకు పైగా ఉంటే 4% ఏక కాల కొవిడ్ రిలీఫ్ సెస్ విధించాలని సూచించింది. ఇదిలా ఉంటే ఈ పన్నులు, సెస్లను అమలులోకి తెస్తే రూ.15వేల కోట్ల నుంచి 18వేల కోట్లు కలిసొస్తాయని అంచనా వేసింది. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపుల్ని పరిమితం చేయాలని సూచించారు. రూ.4 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 4 శాతం విధించాలని కూడా సూచించింది.
తిరస్కరించిన ఐటీ శాఖ
సూపర్ రిచ్పై అధిక పన్నులు విధించాలన్న IRS అధికారుల నివేదికను ఆదాయపు పన్ను శాఖ తిరస్కరించింది. IRS అధికారుల సంఘం ఇచ్చిన నివేదికపై సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ కూడా ట్వీట్ చేసింది.
ఆర్థిక శాఖ ఆగ్రహం, CBDT విచారణ
IRS అధికారులు ఇచ్చిన ఈ నివేదికను ప్రభుత్వ అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని CBDT తెలిపింది. అధికారికంగా ఎవరూ చెప్పకుండానే తమంతట తాముగా రూపొందించిన 50 మంది IRS అధికారులపై విచారణ చేపడుతున్నట్లు తెలిపింది. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రమశిక్షణా రాహిత్యమని, విధి నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఈ తరహా నివేదికను ఇవ్వాలని IRS అధికారుల సంఘాన్ని కోరబోమన్నారు. అనుమతి లేకుండా జోక్యం చేసుకున్నారని తెలిపింది.