పేదరికంలోకి 40 కోట్లమంది భారతీయులు! వీరికే అధిక ప్రమాదం!! అమెరికాలో 41%
కరోనా మహమ్మారి కారణంగా భారత్లో 40 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికులు పేదరికంలోకి వెళ్లవచ్చునని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ILO) నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్యోగాలు కాపాడేందుకు హాంగ్కాంగ్ కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 50% వేతనమే
భారత్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో ప్రభావం ఎక్కువ
భారత్ సహా లాక్ డౌన్ ప్రకటించిన దేశాలు అన్ని కూడా ఉద్యోగాలు, ఆదాయాల అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) తెలిపింది. తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కరోనా ఇప్పటికే కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులపై ప్రభావం చూపుతోందని, భారత్, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది.
40 కోట్ల మంది పేదరికంలోకి
ఇండియాలో 90 శాతం మంది ప్రజలు అసంఘటిత రంగంలో ఉన్నారని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సంక్షోభమని తెలిపింది. భారత్లోని అసంఘటిత రంగంలో పని చేసే 40 కోట్ల మంది కార్మికులు మరింత పేదరికంలోకి జారుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది ILO. ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మంది కార్మికులకు ప్రమాదమని హెచ్చరించింది.
ఉద్యోగాలు లేదా పని గంటల తగ్గింపు ఇలా..
ఈ ఏడాది రెండో క్వార్టర్లో (ఏప్రిల్-జూన్) ప్రపంచవ్యాప్తంగా 6.7% పని గంటలు తుడిచి పెట్టుకుపోవచ్చునని తెలిపింది. ఇది 19.5 కోట్ల ఫుల్ టైమ్ కార్మికులు చేసే పనికి సమానమని పేర్కొంది. పని గంటల తగ్గుదల అరబ్ దేశాల్లో 8.1% లేదా 50 లక్షల ఫుల్ టైమ్ జాబ్స్తో అత్యధికంగా నమోదు కావొచ్చునని తెలిపింది. యూరోప్లో 7.8% లేదా 1.2 కోట్ల ఫుల్ టైమ్ జాబ్స్, ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 7.2% లేదా 12.5 కోట్ల ఫుల్ టైమ్ జాబ్స్గా నమోదు కావొచ్చునని తెలిపింది.
మధ్యతరగతి వారు 7 శాతం మేర నష్టపోవచ్చు
ఆయా ఆదాయ వర్గాల వారు భారీగా నష్టపోవచ్చునని, ఎగువ మధ్యతరగతి వారు అత్యధికంగా 7% మేర నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. ఇది 2008-09 ఆర్థిక సంక్షోభ ప్రభావం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఉద్యోగాలు ఎక్కువే పోవచ్చు
హోటల్స్, ఆహార సేవలు, వస్తు తయారీ, రిటైల్, బిజినెస్ & అడ్మినిస్ట్రేటివ్ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులను తొలుత 2.5 కోట్లుగా అంచనా వేసింది. కానీ పరిస్థితులు చూస్తుంటే అంతకంటే ఎక్కువే ఉండే అవకాశముందని తెలిపింది.
ఐదింటిలో ఒకరికి ఇబ్బంది
3.3 బిలియన్ల శ్రామిక శక్తిలోని ప్రతి ఐదింట ఒకరి కంటే ఎక్కువ మందిపై (81 శాతం) ఈ కరోనా మహమ్మారి ప్రభావం పాక్షికంగా లేదా పూర్తిగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో కార్మికులు, వ్యాపారులు విపత్తును ఎదుర్కొంటారని తెలిపింది.
అధిక రిస్క్ ఉన్న రంగాల్లో..
అధ్యయనం ప్రకారం ఉద్యోగాల తొలగింపులు, వేతనాల తగ్గుదల లేదా పని గంటల తగ్గింపు అధికంగా రిస్క్ ఉన్నట్లు గుర్తించిన రంగాల్లో 1.25 బిలియన్ల మంది కార్మికులు పని చేస్తున్నట్లు ILO తెలిపింది. చాలామంది ఇప్పటికే తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఉన్నారని, ఈ ఉద్యోగాలు పోవడం కూడా ఆందోళనకరమని తెలిపింది.
వీరు అత్యంత ప్రమాదంలో..
ప్రాంతాల వారీగా చూస్తే రిస్క్ రంగాల్లో అమెరికాలో 41 శాతం నుండి ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 26 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది. ఆఫ్రికాలోను ప్రభావం ఎక్కువే ఉండనుంది. ఇక్కడ ప్రభుత్వాలకు ఆరోగ్యం, ఆర్థికం పెద్ద సవాళ్లుగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ మంది అనధికారిక రంగాల్లో పని చేస్తున్నారు. ముఖ్యంగా వీరు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 75 సంవత్సరాల అంతర్జాతీయ సహకారానికి ఇది గొప్ప పరీక్షగా నిలువనుందని, ఒక దేశం విఫలమైతే అందరం (అన్ని దేశాలు) విఫలమైనట్లేనని ILO డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ అన్నారు.
కరోనా మహమ్మారి కోట్లాదిమందిని పేదరికంలోకి నెడుతుందని యునైటెడ్ నేషన్స్ స్టడీ కూడా తెలిపింది.
రిటైల్ రంగంలో 80,000 ఉద్యోగాలు పోవచ్చు
రిటైల్ రంగంలో ఉద్యోగాలు 80,000 వరకు పోవచ్చునని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 768 రిటైలర్లతో ఈ సంఘం సర్వే నిర్వహించింది. చిన్న రిటైలర్లు 30 శాతం మందిని, మధ్యస్థాయి రిటైలర్లు 12శాతం మందిని, పెద్ద రిటైలర్లు 5 శాతం చొప్పున ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయి. సరాసరిగా ఉద్యోగాల కోత 20 శాతం ఉంటుందని అంచనా.