కరోనా ప్రభావం భారత్పై తక్కువే కానీ, ఆ కంపెనీలు క్లోజ్: కంపెనీలు ఏమన్నాయి?
కరోనా వైరస్ ప్రభావం భారత్ పైన తక్కువే ఉందని దిగ్గజ కంపెనీలు అంటున్నాయి. ఆయా కంపెనీల ముఖ్య అధికారులు తమ విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు లేదా పరిమితం చేసుకుంటున్నారు. దేశ, విదేశీ కంపెనీల సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు భారత్ సహా ప్రపంచంలోని తమ ఉద్యోగులకు అండగా ఉంటున్నారు. నైతిక మద్దతిస్తున్నారు.
కరోనా వైరస్ దెబ్బ, ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం
ఎక్కువ కాలం ఉంటే నష్టం.. కానీ
విదేశీ కంపెనీలు సైతం భారత్లో తాము నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువకాలం ఉంటే మాత్రం భారత్ పైన ఎక్కువ ప్రభావమే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, భారత్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటే మన దేశ వ్యాపార అవకాశాలు పెరుగుతాయని భారత కంపెనీలు అంటున్నాయి.
మా ప్రయాణాలు రద్దు..
వైరస్ ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతింటుందని, కొన్ని పరిశ్రమలపై ప్రభావం ప డుతుందని చెబుతున్నారు. కరోనా ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత ఉంటుందని, ఈ నెల 15వ తేదీ వరకు తమ కంపెనీ విదేశీ ప్రయాణాలను రద్దు చేసిందని నెస్ట్లే ఇండియా సీఈవో సురేష్ నారాయణ్ అన్నారు.
కంపెనీ పెద్ద పెద్ద సమావేశాలు రద్దు
కరోనా ప్రభావం ఎంత ఉంటుందో అప్పుడే అంచనా వేయలేమని, కానీ కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ భారీగా ప్రభావం పడే దేశాల్లో భారత్ కాస్త వెనుక ఉండటం ఊరట అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై కరోనా ప్రభావం తక్కువే ఉందని, తమ కంపెనీలో ప్రయాణాలు రద్దయ్యాయని, పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించడం లేదని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అన్నారు. ముడి సరుకులు, విడిభాగాలు, ఇతర పరికరాల కోసం చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పరిశ్రమలు మాత్రం బాగా దెబ్బతింటాయి.
ఆటో పరిశ్రమపై ప్రభావం ఎక్కువే
భారత్లోను భారీ ప్రభావం పడే వాటిలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఐటీ తదితర రంగాలు ఉన్నాయి. కరోనా కారణంగా అన్ని రకాల వాహనాల ఉత్పత్తికి విఘాతమేనని సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. మన ఆటో కంపెనీలు 10% వరకు ముడి సరుకులను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఆటో పరిశ్రమపై ఎక్కువ ప్రభావం పడుతోంది. చైనాలో చాలా కంపెనీలు క్లోజ్ అయ్యాయి. ప్రస్తుత పరిణామం బీఎస్ 6 వాహనాల సరఫరాపై ప్రభావం చూపవచ్చునని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి విడిభాగాల దిగుమతి కోసం ఆటో కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అంతర్జాతీయంగా భారీ దెబ్బ.. ఈ కంపెనీలు క్లోజ్
ఈ ఏడాది తమ వ్యాపారాన్ని కరోనా భారీగా దెబ్బతీయవచ్చని అంతర్జాతీయ స్పోర్ట్స్ వేర్ ఉత్పత్తుల బ్రాండ్స్ ఆడిదాస్, ప్యూమా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఏడాది తొలి క్వార్టర్లో పనితీరుపై తీవ్ర ప్రభావం పడవచ్చని తెలిపాయి. కరోనా కారణంగా చైనాతోపాటు వివిధ దేశాల్లో ఈ రెండు కంపెనీలు తమ రిటైల్ స్టోర్స్ క్లోజ్ చేశాయి.