డిజిటల్ పేమెంట్స్కు కరోనా వైరస్ దెబ్బ, ఈ బిజినెస్ మాత్రమే పెరిగింది!
కరోనా వైరస్ దెబ్బతో దేశంలో చాలా దుకాణాలు మూతబడ్డాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ కూడా తగ్గిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. దీంతో గత రెండు మూడేళ్లలో ఈ పేమెంట్స్ భారీగా పెరిగాయి. జ్యూస్ తాగినా, టీ తాగినా, ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ చేయడం సర్వసాధారణమైంది. కానీ కరోనా దెబ్బకు ఎన్నో దుకాణాలు మూతబడటం, ప్రజలు బయటకు రావడం తగ్గిపోవడంతో ఈ పేమెంట్స్ తగ్గిపోయాయి.
కరోనా ఎఫెక్ట్: పెరిగిన ఆన్లైన్ సేల్స్, అమెజాన్లో 1,00,000 కొత్త ఉద్యోగాలు!
30 శాతం మేర పడిపోతాయని అంచనా
ఎన్నో దుకాణాల మూత, ఎయిర్లైన్ టిక్కెట్ క్యాన్సిలేషన్, ప్రజలు ఖర్చులు తగ్గించుకోవడం, థియేటర్ల మూత, పార్కులు క్లోజ్.. ఇలా వివిధ కారణాలతో డిజిటల్ పేమెంట్స్ 30 శాతం మేర పడిపోతాయని అంచనా. ప్రధానంగా మెట్రో వంటి మెట్రో నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేమెంట్ కంపెనీలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికి కస్టమర్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ..
ప్రస్తుతానికి డిజిటల్ పేమెంట్ ఛానల్స్ కస్టమర్ ట్రాఫిక్ ఎక్కువే ఉంది. కానీ ఇది క్రమంగా తగ్గుతోందట. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్ కస్టమర్ల దినచర్యను ప్రభావితం చేయలేదని చెప్పలేమని అంటున్నారు. ఆఫ్ లైన్ ట్రాన్సాక్షన్స్ను ఇప్పుడే అంచనా వేయలేమని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
వేటిపై ఎంత తగ్గవచ్చునంటే..
కరోనా కారణంగా ఈ-కామర్స్ పేమెంట్స్ 40 శాతం వరకు ఎయిర్లైన్స్ టిక్కెట్ ప్రభావం 30 శాతం, రోడ్ అండ్ ట్రావెల్, టెలికం బిల్స్ ప్రభావం 16 శాతం, ప్రభుత్వ సేవల ప్రభావం 14 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ సంబంధిత కంపెనీలు రేజోర్పే, సీసీఅవెన్యూ దీనిపై స్పందిస్తూ... అన్ని ఆన్లైన్ ఖర్చులు 25 శాతం వరకు తగ్గవచ్చునని పేర్కొన్నాయి.
భారత్ పే ఏం చెప్పిందంటే
ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ 10 శాతం నుండి 15 శాతం మేర తగ్గాయని భారత్ పే తెలిపింది. మార్కెట్లు మూతబడుతున్నాయని, చాలా దుకాణాలు తెరుచుకోవడం లేదని, ముంబై వంటి నగరాల్లో బిజినెస్ తగ్గిందని, దీంతో గత వారం పది రోజులుగా 10 శాతం ట్రాన్సాక్షన్స్ తగ్గినట్లు తెలిపింది.
ఇక్కడ మాత్రం ఆన్లైన్ బిజినెస్ పెరిగింది
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తగ్గినప్పటికీ యుటిలిటీ, కిరాణా, ఆహార విభాగాలలో మాత్రం డిజిటల్ పేమెంట్స్ పెరిగాయట. దుకాణాలు మూతబడుతుండటంతో చాలామంది ఆన్ లైన్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో తప్పనిసరి పదార్థాలలో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయిని రేజోర్పే సీఈవో హర్షిల్ మాథుర్ అన్నారు.
ట్రాన్సాక్షన్స్ పెరిగాయని పేటీఎం
పేటీఎం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇదివరకటి కంటే రోజువారీ డిజిటల్ పేమెంట్స్ తమకు పెరిగాయని చెప్పడం గమనార్హం. ఫ్యూయల్, యుటిలిటీ, ఫుడ్ వంటి వాటిలో పెరుగుదల ఉందని తెలిపారు. క్యాష్ కంటే పేటీఎం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని దీంతో పేమెంట్స్ పెరిగాయన్నారు.