పడకేసిన మౌలిక రంగాలు, ఫెర్టిలైజర్స్ మినహా 7 రంగాలు డౌన్
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ దెబ్బకు మౌలిక రంగం కుదేలయింది. వరుసగా మూడో నెలలో వివిధ రంగాల్లో ఉత్పత్తి మైనస్ 23.4 శాతానికి పడిపోయింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పడిపోయిన ఉత్పత్తి మే నెలలోను తగ్గింది. కీలకంగా భావించే బొగ్గు, ఎరువులు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి పడిపోయాయి. 2019 మేలో ఈ ఎనిమిది రంగాల ఉత్పత్తి 3.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.
6 నెలల్లో ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి: ఉద్యోగుల్లో సరికొత్త విశ్వాసం
కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎరువుల పరిశ్రమ మినహా మిగతా ఏడు రంగాలైన బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్, సిమెంటు, విద్యుత్ మే నెలలో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2020-21 ఏప్రిల్-మే మధ్యకాలంలో మౌలిక రంగాల ఉత్పత్తి 30 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే సమయంలో 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రారంభమైంది.
ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగింది. దీంతో బొగ్గు, సిమెంటు, ఉక్కు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ముడిచమురు తదితర పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ నెలలో కోర్ రంగాల వృద్ధి 37 శాతం క్షీణించింది. 2019-20లో క్యుములేటివ్ గ్రోత్ 0.3 శాతంగా ఉంది. ఎనిమిదేళ్లలో ఇది కనిష్టం.
ఉక్కు మే నెలలో 48.4 శాతం పడిపోయింది. సిమెంట్ 22.2 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 21.3 శాతం, సహజ వాయువు 16.8 శాతం క్షీణత నమోదయింది. ఇండెక్స్లో 20 శాతం ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ 15.6 శాతం తగ్గింది. 10 శాతంగా ఉండే బొగ్గు 14 శాతం తగ్గింది. 3 శాతంగా ఉండే ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ 7.5 శాతానికి పెరిగింది. అంతకుముందు రెండు నెలలు ఈ ఉత్పత్తి తగ్గుతూ వచ్చింది.