ఉద్యోగులకు మందగమనం దెబ్బ, వేతనాల పెంపు ఎంతంటే? వీటిలో ఇంకా తక్కువ
కంపెనీల్లో శాలరీ హైక్ టైమ్ వచ్చింది. ఈసారి వేతనం ఎంత పెరుగుతుంది... అనే ఆయా కంపెనీల ఉద్యోగులు లెక్కలు వేసుకుంటుంటారు. ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా వేతనాలు పెంచుతుంది. భారత్లో ఈసారి సరాసరిగా వేతనాలు 7.8 శాతం వరకు పెరగవచ్చునని తేలింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తమ ఉద్యోగులకు ఇచ్చే వేతన పెంపుపై డెలాయిట్ ఇండియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 7.8 శాతం ఇచ్చే అవకాశముందని తేలింది.
3 నెలల్లో అమెరికా పౌరసత్వం? ధనిక భారతీయులు ఈ మార్గంలో వెళ్తున్నారు
కంపెనీలపై ఒత్తిడి
గత ఏడాది ఇచ్చిన (అంటే ప్రస్తుతం కొనసాగుతున్న సంవత్సరం) శాలరీ హైక్తో పోల్చితే ఇది తక్కువ. ఆర్థిక మందగమనం, పోటీ పెరగడం, కంపెనీల లాభాలపై ఒత్తిడి, వంటి అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. దీంతో వైట్ కాలర్ వేతనాలు మందగించాయని డెలాయిట్ ఇండియా పేర్కొంది. కంపెనీలు ఉద్యోగులకు సగటున ఈసారి 7.8 శాతం వేతనాలు పెంచుతున్నాయని తెలిపింది.
గతంలో కంటే 40 బేసిస్ పాయింట్లు తక్కువ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.2 శాతం పెంపుతో పోల్చితే ఇప్పుడు పెంచబోయే వేతనం 40 బేసిస్ పాయింట్లు తక్కువ అని సర్వే నివేదిక తెలిపింది. వివిధ కారణాలతో ఈసారి వేతన పెంపు పెద్దగా ఉండదని ముందే ఊహించినట్లు పేర్కొంది.
వ్యయ నియంత్రణలో భాగంగా...
7 రంగాలు, 20 ఉపరంగాలకు చెందిన 300 సంస్థల మానవ వనరుల విభాగం మేనేజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. వేతనాల పెంపు, పనితీరు నిర్వహణ, నియామకాలు, పారితోషికాల రూపకల్పన వంటి పలు అంశాలపై సర్వేలో అభిప్రాయాలు అడిగి రిపోర్ట్ తయారు చేసింది డెలాయిట్. వ్యయ నియంత్రణలో భాగంగా వేతనాల పెంపుకు పనితీరు, సామర్థ్యానికి కంపెనీలు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తేలింది.
పెంపు ఏ ఆధారంగా ఉంటుందంటే
గత ఏడాది పనితీరు ఆధారంగా శాలరీ పెంపును నిర్ణయిస్తున్నట్లు 90 శాతం కంపెనీలు వెల్లడించాయి. సామర్థ్యం ఆధారంగా వేతనాల పెంపు ఉంటుందని 34 సంస్థలు చెప్పాయి.
టాలెంట్ మార్కెట్ ప్రాధాన్యతలు భిన్నంగా..
టాలెంట్ మార్కెట్ ప్రాధాన్యతలు అయిదేళ్ల క్రితం ఉన్న వాటికి భిన్నంగా ఉందని, కంపెనీల పే బడ్జెట్ ప్రక్రియ, డేటా దానిని ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఘోష్ అన్నారు.
10 శాతం కేవలం 8 శాతం కంపెనీలే..
ఈ సర్వేలో దాదాపు 50 శాతం కంపెనీలు 8 శాతం కంటే తక్కువ వేతనం పెంపును అంచనా వేస్తున్నాయని తేలింది. కేవలం 8 శాతం కంపెనీలు మాత్రమే 10 శాతం కంటే ఎక్కువ వేతనాల పెంపును చెబుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 30 శాతం కంపెనీలు వేర్వేరు ఇంక్రిమెంట్లు ఉంటాయని పేర్కొంది. అంటే హోదాల ఆధారంగా వేతనాలు ఉంటాయని తెలిపింది.
వీటిలో పెంపు తక్కువ..
మౌలికం, స్థిరాస్థి, NFBC, టెలికం వంటి రంగాల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా పెరిగే అవకాశముందని ఈ సర్వేలో వెల్లడైంది.
పెరిగిన తొలగింపులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వచ్చంధంగా ఉద్యోగాలను వదులుకోవడం దేశవ్యాప్తంగా 15 శాతానికి పైగా తగ్గింది. అలాగే తొలగింపులు 20 శాతం పెరిగాయని తేలింది. వెహికిల్, ఇన్సురెన్స్, NFBC రంగాల్లో ఉద్యోగాల తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆటోమేషన్ ప్రభావంతో ఆయా కంపెనీలలో నియామకాలు తగ్గించుకుంటున్నట్లు సర్వేలో తేలింది.