ఆందోళన వద్దు.. కంపెనీ హెల్తీగానే ఉంది, శాలరీ పెంపు మాత్రంలేదు: ఉద్యోగులకు ధీమా
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు పోతాయి లేదా శాలరీ కట్ చేస్తారనే ఆందోళనల నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు భరోసా ఇస్తున్నాయి. కాగ్నిజెంట్ వంటి కంపెనీలో 25 శాతం అదనపు శాలరీ, విప్రో, యాక్సెంచర్, టెక్ మహీంద్రా వంటి వాటిలో ప్రాసెస్లో ఉన్న ఉద్యోగాలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. మరికొన్ని కంపెనీలు కూడా గుడ్ న్యూస్ చెబుతున్నాయి. దిగ్గజ కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు కొన్ని హామీ ఇస్తున్నాయి.
ఐటీ కంపెనీల గుడ్న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!
ఈ నెల నుండే అదనపు వేతనం
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారతీయ ఉద్యోగులకు 25% అధికంగా వేతనాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ సంస్థలో మొత్తం 2.03 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ నెల నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈవో తెలిపారు.
ఉద్యోగుల తొలగింపు లేదు... కానీ పెంపు ఉండదు
ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించేది లేదని ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్ (PWC) స్పష్టం చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, బోనస్లు మాత్రం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్లో సకాలంలోనే మార్చి నెల జీతాల్ని అందజేస్తామని సమాచారాన్ని ఇచ్చింది.
కొన్ని సంస్థలు ముందే చెల్లింపు
భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఉద్యోగులకు మార్చి నెల జీతాన్ని చెల్లించింది. దాల్మియా భారత్ గ్రూప్ మార్చి 26-27 తేదీ మధ్యలోనే ఉద్యోగులకు ముందుగానే వేతాలు జమ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా పలు సంస్థలు ముందే చెల్లింపులు జరిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.30,000 లోపు వేతనం కలిగిన వారికి ఈ మొత్తాన్ని ఇబ్బంది లేకుండా రెండు పర్యాయాలు అందిస్తామని తెలిపింది.
ఉద్యోగుల్లో ధైర్యం నింపుతున్న కంపెనీలు
తాము ఉద్యోగులను తొలగించేది లేదని, అలాగే వేతనాలు తగ్గించేది లేదని మరికొన్ని సంస్థలు కూడా ఉద్యోగులకు భరోసా ఇచ్చాయి. శ్రీనివాసా ఫామ్స్, అబీబస్, రాంకీ ఎస్టేట్స్ తదితర సంస్థలు ఉద్యోగుల్లో ధైర్యం నింపాయి. తమ వద్ద పనిచేసే నాలుగు వేలమంది ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎలాంటి కోతలు విధించడం లేదని శ్రీనివాసా ఫామ్స్ తెలిపింది. 200 మంది ఉద్యోగులకు ఇబ్బంది లేదని అబీబస్ స్పష్టం చేసింది. ఐటీ సంస్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు భరోసా ఇచ్చాయి.
ఉద్యోగులకు అండగా ఉంటాం.. ఫ్లిప్కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా ఉద్యోగాల విషయంలో భయాందోళన అవసరం లేదని హామీ ఇచ్చింది. అందరి ఉద్యోగాలకు గ్యారంటీ ఉందని భరోసా కల్పించే ప్రయత్నాలు చేశారు కంపెనీ సీఈవో. ఉద్యోగాల తొలగింపు లేదా వేతన కోత ఉండదని, సిబ్బంది, వ్యాపార భాగస్వాములు సహా అందరికీ ఉద్యోగ, ఉపాధి భద్రత ఉంటుందని, ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను తగ్గించమని, ఉద్యోగ ఆఫర్లనూ వెనక్కి తీసుకోమని, ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉంటామని ప్రకటించింది. ఫ్లిప్కార్ట్లో 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తమ కంపెనీ ఫైనాన్షియల్గా బాగుందని సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు.
ఈ రంగాల్లోనే ఇబ్బందికరం
వీవో, ఒప్పో మొబైల్స్ వంటి సంస్థలు ఉద్యోగులకు భరోసా ఇచ్చాయి. మోర్గాన్ స్టాన్లీ వంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోత లేదా శాలరీ కోత లేదని చెప్పాయి. కరోనా కారణంగా విమానయానరంగం, టూరిజం, హోటల్స్ భారీగా దెబ్బతిన్నాయి. అమ్మకాలు లేక ఇతర రంగాలు కూడా నష్టపోయాయి. అయితే ఇప్పటి వరకు విమానయానం, టూరిజం, హోటల్ రంగాల్లోనే ఉద్యోగాల భయం ఎక్కువగా ఉంది. విమానయానం ఇప్పటికే తమ ఉద్యోగులకు వేతనాలు కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రంగాలు తమ ఉద్యోగుల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నాయి.