కాగ్నిజెంట్ జాబ్ కట్: హైదరాబాద్లో 500మంది భవిష్యత్తుపై అనిశ్చితి
హైదరాబాద్: ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు షాకిచ్చింది. రానున్న త్రైమాసికాల్లో దాదాపు 13వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. 7వేలమంది ఉద్యోగుల తగ్గింపుతో పాటు కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి తప్పుకుంటుండటంతో దాదాపు 6వేల మంది ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని కంపెనీకి చెందిన అధికారి ఒకరు సంకేతాలు ఇచ్చారు.
ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్, ఆ కారణంతో 7,000 ఉద్యోగాల తొలగింపు!
లాభాల్లో కాగ్నిజెంట్
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి కాగ్నిజెంట్ 497 మిలియన్ డాలర్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో 477 మిలియన్ డాలర్లతో పోలిస్తే 4.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఏడాదికి గాను ఆదాయంలో వృద్ధి 4.6 నుంచి 4.9 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 4.25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. గత కొన్నాళ్లుగా కంపెనీ అన్ని విభాగాల్లో రాణిస్తోందని, ఐటీ రంగంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా నమోదయినట్లు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్షైర్ తెలిపారు.
భారత్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా 10,000 నుంచి 12,000 వరకు మధ్యస్థాయి నుంచి సీనియర్ లెవల్ స్థాయి ఉద్యోగులపై వేటు పడనుంది. స్థూలంగా 12వేల మంది వరకు ఉండగా, నికరంగా మాత్రం 5వేల నుంచి 7వేల వరకు అని చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో ఈ వాటా 2%. ఇక, భారత్లోనూ ఈ కంపెనీలో పని చేసే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా.
భారత్ కంపెనీ ఉద్యోగులపై ప్రభావం
సెప్టెంబర్ 2019 నాటికి సంస్థలో దాదాపు 2.90 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. భారత్లో పెద్ద మొత్తంలో ఉద్యోగులు ఉన్నారు. దాదాపు రెండు లక్షలమంది భారత్లో పని చేస్తున్నందున ఈ జాబ్ కట్ ప్రభావం భారత్ పైన అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వివిధ దేశాల్లో, వివిధ కేంద్రాల్లో ఎంతమందిని తగ్గించే ప్రకటన రాలేదు. కానీ 7వేల నుంచి 13వేల వరకు జాబ్ కట్ ఉంటుంది.
కంటెంట్ ఆఫరేషన్ నుంచి అందుకే ఔట్!
ప్రస్తుతం కంపెనీ 5 నుంచి 7వేల మందిని తొలగించడంతో పాటు మరో 5వేల మంది 2020 మధ్య కాలానికి స్వచ్చంధంగా ఇతర కంపెనీలకు వలసపోయే ఆస్కారం ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తమ వ్యూహాత్మక వ్యాపార కార్యకలాపాలకు భిన్నంగా ఉన్నందువల్ల కంటెంట్ ఆపరేషన్స్ నుంచి పాక్షికంగా వైదొలుగుతున్నట్లు సీఈఓ చెప్పారు. తొలగించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే ఆస్కారం ఉందా అనే అంశం తమ భాగస్వాములు, వెండర్లతో చర్చించి జాబ్ కట్ ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తామన్నారు.
హైదరాబాద్ కాగ్నిజెంట్లో ఆ ఉద్యోగులు 500 మంది
కాగ్నిజెంట్ తీసుకున్న జాబ్ కట్ ప్రభావం హైదరాబాద్లోని కాగ్నిజెంట్ కేంద్రంపై పడనుంది. ఇక్కడ దాదాపు 25,000 మంది పని చేస్తున్నారు. 8,000 నుంచి 10,000 మంది ఐటీ సేవల్లో, 15,000 మంది బీపీఓ సేవల్లో ఉన్నారు. అలాగే, ఫేస్బుక్లో అభ్యంతరకర వీడియోలు, కంటెంట్ వస్తుందా అనే విభాగంలో 500 మంది పని చేస్తున్నారని తెలుస్తోంది. వీరు చేస్తున్న ప్రాజెక్టులు డిసెంబర్ నెలలో పూర్తవుతాయట. ఫేస్బుక్ ప్రమాణాలకు అనుగుణంగా కంటెంట్ ఉందా లేదా అని పరిశీలించి అభ్యంతకర అంశాలు తొలగించడమే ఈ కాగ్నిజెంట్ ఉద్యోగుల పని.
సేవ్ చేసేందుకే..
అయితే, పై ప్రాజెక్టులు పూర్తికాగానే ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కాగ్నిజెంట్ హైదరాబాద్లో గతంలోను జాబ్ కట్ చోటు చేసుకుంది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వచ్చే ఏడాదికి 150 మిలియన్ డాలర్ల నుంచి 200 మిలియన్ డాలర్లను సేవ్ కాగ్నిజెంట్ భావిస్తోంది. 2021 నాటికి 500 మిలియన్ డాలర్ల నుంచి 550 మిలియన్ డాలర్లు సేవ్ చేయాలని భావిస్తోంది. న్యూజెర్సీ బేస్డ్ కాగ్నిజెంట్కు ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి వచ్చే ఆదాయం 1.9 శాతం పెరిగి 1.49 బిలియన్ డాలర్లకు పెరిగింది. హెల్త్ కేర్ సేవల్లో 1.2 శాతం తగ్గి 1.18 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రెండు సేవల నుంచే కంపెనీకి సగాని కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది.