కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, ఎండీ రామ్కుమార్ రామమూర్తి రాజీనామా
న్యూఢిల్లీ: కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్కుమార్ రామమూర్తి తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్రీస్ ఉద్యోగులకు శుక్రవారం(జులై 10న) వెల్లడించారు. రామ్ కుమార్ కాగ్నిజెంట్ కంపెనీలో సుమారు 23ఏళ్లపాటు పనిచేశారు.
రామ్ కుమార్ సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని ఈ సందర్భంగా సీఈవో బ్రియాన్ వ్యాఖ్యానించారు. ఇక కంపెనీలో 24ఏళ్లపాటు పనిచేసిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఈ విషయాన్ని సీఈఓ బ్రియాన్ వెల్లడించారు.
ప్రదీప్ కుటుంబంతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారని, తదుపరి సవాల్ కు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, ప్రదీప్ షిలిగే బాధ్యతలను ఆండీ స్టాఫోర్డ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్ వీరిద్దరు సంస్థ నుంచి వైదొలుగుతుండటంతో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
కరోనా మహమ్మారి కాలంలోనూ కాగ్నిజెంట్ సంస్థ మంచి ఫలితాలను సాధించిందని బ్రియాన్ తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తోందని చెప్పారు.
ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగిందని వివరించారు. ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. తమ సంస్థ సేవలను అందిస్తూనే ఉందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో బ్రియాన్ పేర్కొన్నారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బహుళ జాతి సంస్థ భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులను కలిగివుంది.