మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయంతో రూ.1.2 లక్షల కోట్ల ఆదా, DAపై ఉద్యోగులకు అలా ఊరట
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి వచ్చే ఏడాది జూన్ వరకు కొత్త డియర్నెస్ అలవెన్స్(DA)ను ఆపివేసిన విషయం తెలిసిందే. గతంలో తీసుకున్న పెంపు నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ పడ్డారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మన దేశంలో లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. పేదలకు ఉచిత రేషన్ ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
COVID 19: మోడీ ప్రభుత్వం కాస్ట్ కట్టింగ్! ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్
ఉద్యోగులకు ఊరట
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. వచ్చే ఏడాది జూన్ 30 వరకు పాత రేట్ల ప్రకారమే ప్రస్తుత డీఏ చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. 2021 జూలైలో కొత్త డీఏపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత, 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి నెలల వరకు వర్తించే రేట్లను దాంతో జత చేయనున్నట్లు తెలిపింది. ఇది ఉద్యోగులకు ఊరటే అని చెప్పవచ్చు.
వచ్చే ఏడాది అన్ని కలిపి
2020 జనవరి నుండి 2021 జూన్ 30వ తేదీ వరకు బకాయిల చెల్లింపు మాత్రం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 17% డీఏ అమలులో ఉంది. గత జనవరి నుండి కొత్తగా ప్రకటించిన 4% జత చేసి ఇవ్వాలి. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాది జూలై వరకు దీనిని నిలిపివేసింది. అయితే వచ్చే ఏడాది జూలైలో కొత్త డీఏను ప్రకటించినప్పుడు దానిని 17%కు ఈ 4% కూడా జత చేస్తారు. అంటే ఉద్యోగులు కరోనా కారణంగా ఈ ఏడాది మాత్రమే దానిని పొందలేరు. కానీ వచ్చే ఏడాది అన్నీ కలిపి ఇస్తారు.
ఎంతమందిపై ప్రభావం
దేశవ్యాప్తంగా 49.26 లక్షల మంది ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లపై ఈ ప్రభావం పడుతుంది. డీఏ పెంపు నిలిపివేత కారణంగా కేంద్రానికి పెద్ద ఎత్తున నిధులు ఆదా అవుతాయని భావిస్తున్నారు.
రూ.1.2 లక్షల కోట్లు మిగులు
ప్రస్తుతం అమల్లోని 17% డీఏ చెల్లింపు 2021 జూన్ 30 వరకు కొనసాగుతుందని పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాలనే అనుసరించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లపై ఈ ప్రభావం ఉంటుంది. తద్వారా దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.82,566 కోట్లు కలిపి మొత్తం రూ.1.2 లక్షల కోట్ల నిధులు మిగులుతాయని అంచనా. కరోనా నియంత్రణ చర్యల కోసం వీటిని ఉపయోగించవచ్చు.
డీఏ
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో ఈ మొత్తాన్ని కరోనాపై పోరుకు ఉపయోగించే వీలు కలుగుతుంది. కరోనాపై పోరుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన, కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్ల వేతనాల్లో 30% కోత విధించిన విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు ఉపయోగిస్తారు.