ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రూ.33,923 కోట్లు, పోలవరానికి ముందే రూ.5,103 కోట్ల రుణం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు రెవెన్యూ లోటు భర్తీ, మిగిలిన నిధులతో సహా ఇప్పటి వరకు రూ.33,923.01 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు. బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్, వైసీపీ సభ్యులు లిఖితపూర్వకంగా రెవెన్యూ గురించి ప్రశ్నించారు. అనంతరం జీఎస్టీ బకాయిల అంశాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకు వెళ్లారు.
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
పరిశీలించాకే ఆర్థిక సాయం
రాజ్యసభలో ఏపీకి ఇచ్చిన నిధులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి స్పందించారు. బుందేల్ ఖండ్, కేబీకే ప్యాకేజీలను పరిశీలించిన తర్వాతే నీతి అయోగ్ ఆంధ్రప్రదేశ్లోని 7 వెనుకబడిన జిల్లాలకు రూ.2,100 కోట్ల ఆర్థిక సాయం అందించాలని సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు.
రూ.5,103 కోట్ల రుణం ఇవ్వండి
మరోవైపు, పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ అంశాలపై విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీలు సీతారామన్తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.5,103 కోట్లు రుణం తీసుకొని ఖర్చు చేసిందని, దానిని వెంటనే కేంద్రం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రూ.55,548 కోట్లతో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ప్రాజెక్టు పనుల కోసం ఏపీ ప్రభుత్వం చేసే ఖర్చును 15 రోజుల గడువులోగా కేంద్రం చెల్లింపులు జరిపేలా పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించాలన్నారు.
జీఎస్టీ నష్టపరిహారం
జీఎస్టీ నష్టపరిహార బకాయిల కింద రాష్ట్రానికి రూ.1,605 కోట్లు రావాల్సి ఉందని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకు వచ్చారు. నెలల తరబడి పెండింగులో ఉన్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, బకాయిల చెల్లింపులో జాప్యం వల్ల ఏపీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉన్నందున రూ.1,605 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు.
రూ.1,050 కోట్లు ఇవ్వండి
అలాగే, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆరేళ్ల పాటు ప్రత్యేక సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన రూ.1,050 కోట్లు విడుదల చేయాలని కోరారు. బుందేల్ ఖండ్, కలహండి ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.4వేలు లెక్కగట్టి ప్యాకేజీ ఇచ్చారని, ఏపీలో మాత్రం తక్కువగా లెక్కించారన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు గ్రాంటును సవరించాలని కేంద్రాన్ని కోరామని, అంగీకారం తెలిపారని, ఈ అంశానికి త్వరితగతిన పరిష్కారం కనుగొని రెవెన్యూ లోటు గ్రాంట్ కింద ఏపీకి రావాల్సిన రూ.18,969 కోట్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని వైసీపీ ఎంపీలు కోరారు.