చక్కెర ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం: జూన్ 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: కొద్దిరోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతులను నిషేధించింది. దీనిపై విమర్శలు తలెత్తడంతో ఈ నిషేధాజ్ఞల్లో కొన్ని సవరణలు చేసింది. పాక్షికంగా గోధుమలను ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది. భారత్ నుంచి గోధుమల ఎగుమతులు తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వాటి రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు తాజాగా చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పడింది. చక్కెర ఎగుమతులను నియంత్రించడానికి చర్యలు తీసుకుంది. ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
ఆరేళ్ల తరువాత..
ఆరు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులను నియంత్రించడం ఇదే తొలిసారి. షుగర్ సీజన్ 2021-2022 (అక్టోబర్-సెప్టెంబర్) మధ్యకాలంలో దేశంలో చక్కెర లభ్యత, బహిరంగ మార్కెట్లో వాటి ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
గత ఏడాది సెప్టెంబర్లో..
గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి దేశంలో చక్కెర నిల్వలు 60 నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండేవి. ప్రతినెలా ఏర్పడే చక్కెర డిమాండ్ 24 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటోందని వివరించింది. మున్ముందు బహిరంగ మార్కెట్లో చక్కెరకు ఏర్పడే డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చనే కారణంతో వాటి ఎగుమతులపై ఆంక్షలను విధించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. ఎగుమతులను 10 లక్షల టన్నులకే పరిమితం చేసింది.
ఈఆర్ఓ తప్పనిసరి..
ఈ పరిణామాల మధ్య చక్కెర మిల్లుల యజామనులు, ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి మిల్లర్లు, ఎగుమతిదారులు తప్పనిసరిగా ఎక్స్పోర్ట్ రిలీజ్ ఆర్డర్ (ఈఆర్ఓ)ను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈఆర్ఓను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ షుగర్ మంజూరు చేస్తుంది. ఈ ఆర్డర్ లేనిదే చక్కెరను విదేశాలకు ఎగుమతులు చేయలేరని స్పష్టం చేసిందా మంత్రిత్వ శాఖ.
రెండో అతిపెద్ద దేశంగా..
చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద దేశంగా ఉంటోంది భారత్. బ్రెజిల్ తరువాత రెండో అతిపెద్ద దేశం ఇదే. బంగ్లాదేశ్, ఇండొనేషియా, మలేసియా, దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, కొన్ని ఆఫ్రికన్ దేశాలకు భారత్ బిగ్గెస్ట్ షుగర్ ఎక్స్పోర్టర్గా ఉంటోంది. 2018-19లో 38 లక్షల టన్నుల చక్కెరను భారత్ ఎగుమతి చేసింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 2019-20లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 59.60 లక్షల టన్నులకు చేరింది. 2020-21లో నమోదై చక్కెర ఎగుమతులు 70 లక్షల టన్నులు.
10 లక్షల టన్నులకే..
కాగా- ప్రతి సంవత్సరం భారీగా నమోదవుతోన్న చక్కెర ఎగుమతులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఎగుమతుల పరిమాణాన్ని 10 మిలియన్ టన్నులకే పరిమితం చేసింది. అక్టోబర్లో పండగల సీజన్ ఆరంభమైన తరువాత దేశీయ మార్కెట్లో చక్కెరకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
నష్టాల్లో షుగర్ స్టాక్స్..
కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులను నియంత్రిస్తుందంటూ వచ్చిన వార్తల ప్రభావం స్టాక్ మార్కెట్పై పడింది. చక్కెర మిల్లులకు సంబంధించిన షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, ధామ్పూర్ షుగర్, బల్రామ్పూర్ చీనీ మిల్స్, ఈఐడీ ప్యారీ, ఉగర్ షుగర్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, శ్రీ రేణుకా షుగర్స్ షేర్ల ధరలు క్షీణించాయి. ఈ సెగ్మెంట్కు చెందిన షేర్లన్నీ కూడా రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి.