V షేప్ రికవరీ: ఈసీఓ సుబ్రమణియన్, విశ్వాసం పెంచుతున్నాయి
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.5 శాతం నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతంతో భారీగా పతనం కాగా, రెండో త్రైమాసికంలో పది శాతం నుండి 13 శాతం మేర క్షీణత నమోదవుతుందని అంచనా వేయగా, మైనస్ 7.5 శాతంగా ఉంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో క్షీణత నమోదు చేయడంతో టెక్నికల్గా భారత్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. రెండో త్రైమాసిక ఫలితంపై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కే సుబ్రమణియన్ స్పందించారు.
పుంజుకుంటున్న ఎకానమీ, Q2లో 7.5 శాతం క్షీణత: టెక్నికల్గా ఆర్థిక సంక్షోభంలో భారత్..
V షేప్ రికవరీ
రెండో త్రైమాసిక జీడీపీ సంఖ్యలు కూడా ప్రతికూలంగా ఉండటంతో భారత్ సాంకేతికంగా సంక్షోభంలోకి వెళ్లిందని, అయినప్పటికీ 7.5 శాతం ప్రతికూల వృద్ధి రేటు అంచనాల కంటే కాస్త బాగుండటంతో ఇది ఎంకరేజింగ్గా ఉందని సుబ్రమణియన్ అన్నారు. V షేప్ రికవరీ కనిపిస్తోందన్నారు. రంగాలవారీగా చూస్తే మౌలికసదుపాయాలు, ఉత్పత్తి, ఎలక్ట్రిసిటీ వృద్ధి రేటు బాగుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం వృద్ధి రేటు మంచి పెరుగుదలను నమోదు చేస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి కోలుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు.
రంగాలవారీగా...
రంగాలవారీగా వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ 3.4 శాతం వృద్ధి, మైనింగ్, క్వారియింగ్ మైనస్ 9.1 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్ మైనస్ 0.6 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి యుటిలిటీ సేవలు మైనస్ 4.4 శాతం, నిర్మాణం మైనస్ మైనస్ 8.6 శాతం, వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలు మైనస్ 15.6, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి నైపుణ్య సేవలు మైనస్ 8.1, శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ తదితర సేవలు మైనస్ 12.2 శాతంగా ఉంది.
దేశంలోని ఎనిమిది కీలక రంగాలు అక్టోబర్ నెలలోను మైనస్ 2.5 శాతంగా నమోదయింది.
ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్ రంగాల్లో ఉత్పత్తి భారీగా క్షీణించడం ఇందుకు కారణం. బొగ్గు, ఎరువులు, విద్యుత్, సిమెంట్ రంగాల ఉత్పత్తిలో సానుకూల వృద్ధి ఉంది.
వృద్ధి బాట..
ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోందని, ప్రత్యేకించి తయారీరంగం సానుకూలతలోకి రావడం హర్షణీయమని, వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు దోహదపడ్డాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో (అక్టోబర్-మార్చి) వృద్ధికి వస్తోందన్న విశ్వాసం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది.
తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.