Income tax E-Filing: ఈ ఫామ్ ఫైలింగ్ గడువు మరో నెల రోజులు పెంపు
కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా సీబీడీటీ 15సీఏ/15సీబీ ఫామ్స్ ఫైలింగ్ చేసే వారికి ఊరట ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఫైలింగ్లో మరింత సడలింపులు చేసింది. మ్యాన్యువల్ ఫైలింగ్ తేదీని పొడిగించింది. కొత్త పోర్టల్లో సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఈ గడువును ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది.
పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆగస్ట్ 15వ తేదీ వరకు అధీకృత డీలర్లకు ఫామ్ 15సీఏ/15సీబీని నేరుగా సమర్పించవచ్చునని తెలిపింది. ఐటీ చట్టం 1961 ప్రకారం ఫామ్ 15సీఏ/15సీబీని డిజిటల్ రూపంలో అందించాలి. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు 15సీబీ చార్డర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్తో పాటు 15సీఏని, ఈ-ఫైలింగ్ పోర్టల్లో అవసరమైన చోట అప్ లోడ్ చేస్తారు. ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్కు కాపీని సమర్పించే ముందు దీనిని అప్ లోడ్ చేస్తారు.
పోర్టల్లో సమస్యల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులు స్వయంగా అధీకృత డీలర్కు సమర్పించవచ్చు. ఈ గడువు ఇప్పటి వరకు జూలై 15 వరకు ఉండగా, దీనిని ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించింది. విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం 2021 ఆగస్ట్ 15 వరకు ఇలాంటి ఫామ్స్ను అంగీకరించాలని సీబీడీటీ సూచించింది.