PharmEasy IPO: కొంప మునిగేలా ఉందే: సెబికి లేఖ రాసిన వ్యాపార సమాఖ్య
ముంబై: ఆన్లైన్ ఇ-ఫార్మా ప్లాట్ఫామ్ ఫార్మ్ఈజీ పబ్లిక్ ఇష్యూ భవితవ్యం డోలాయమానంలో పడేటట్టే కనిపిస్తోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేయడానికి సమాయాత్తమౌతోన్న ఈ కంపెనీకి బిగ్ షాక్ ఇచ్చాయి వ్యాపార, వాణిజ్య సంఘాలు. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి ఫార్మ్ఈజీ అందజేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్కు అనుమతులు ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తోన్నాయి. అక్కడితో ఆగట్లేదు. ఏకంగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబి)కి లేఖ సైతం రాశాయి.
ఆర్థిక సలహాదారు పదవి కోసం ఈ ముగ్గురి పేర్లు షార్ట్లిస్ట్: ప్రభుత్వం తుదినిర్ణయం
అఖిల భారత వాణిజ్య సంఘాల సమాఖ్య (సీఏఐటీ) ఈ మేరకు సెబికి లేఖ రాసింది. ఫార్మ్ఈజీ అందజేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్కు ఆమోదించకూడదని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనలను తోసి పుచ్చాలని కోరింది. దీనికి గల కారణాన్ని తాను రాసిన లేఖలో పొందుపరిచింది. ఇంటర్నెట్ ద్వారా మెడిసిన్స్ను విక్రయించడానికి అనుమతి లేదని తెలిపింది. ఈ మేరకు 2018లో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉటంకించింది. ఈ మేరకు సెబి ఛైర్మన్ అజయ్ త్యాగికి లేఖ రాసింది.
ఫార్మ్ఈజీ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా అక్రమాలపై ఆధారపడి ఉన్నాయని వాణిజ్య సంఘాల సమాఖ్య ఆరోపించింది. ఫార్మ్ఈజీని లీడ్ చేస్తోన్న ఏపీఐ హోల్డింగ్స్ అందజేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్లో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపింది. ఫార్మ్ఈజీ పబ్లిక్ ఇష్యూను ఆమోదించకూడదంటూ సౌత్ కెమిస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఎస్సీడీఏ) ఇదివరకే లేఖ రాసిన విషయాన్ని ఈ సమాఖ్య గుర్తు చేసింది. ఎస్సీడీఏ.. నవంబర్లో సెబికి ఈ లేఖను రాసింది.
ఇంటర్నెట్ ద్వారా మెడిసిన్స్ను విక్రయించడం అనేది 2018లో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు పూర్తి విరుద్ధమని వాణిజ్య సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ గుర్తుచేశారు. ఈ విషయంలో ఫార్మ్ఈజీపై కోర్టు ధిక్కారణ కేసు ఇంకా విచారణలో ఉందని తెలిపారు. ఫార్మ్ఈజీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ చేసే ప్రక్రియను చేపట్టడాన్ని నిరసిస్తూ ఈ సమాఖ్య ఇటీవలే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సైతం లేఖ రాసింది.
ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను తన లేఖకు జత చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ 1940 చట్టంలోని 1945 రూల్స్ కింద ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ను విక్రయించడానికి ఏ సంస్థకు కూడా అనుమతి లేదని ప్రవీణ్ ఖండెల్వాల్ స్పష్టం చేశారు. ఎలాంటి లైసెన్సులు గానీ, అనుమతులు గానీ లేకుండా చట్టవిరుద్ధంగా ఫార్మ్ఈజీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని, అలాంటి కంపెనీ పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం సరికాదని చెప్పారు. ఇంజెక్షన్లు, మెడిసిన్లను లైసెన్స్ లేకుండా విక్రయించడం చట్టరీత్యా నేరమని అన్నారు.