కెయిర్న్కు రూ.7600 కోట్లు చెల్లించండి, వొడాఫోన్ తర్వాత భారత్కు మరో షాక్
ఢిల్లీ: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థకు సంబంధించిన రెట్రో స్పెక్టివ్ పన్ను వివాదం కేసులో భారత్కు షాక్ తగిలింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. భారత్ కోరిన పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పైగా ఈ కేసు నేపథ్యంలో భారత్ నిలిపివేసిన డివిడెండ్లు, పన్ను తిరిగి చెల్లింపులు సహా ట్యాక్స్ వసూలు కోసం అమ్మిన షేర్ల ద్వారా వచ్చిన సొమ్మును వడ్డీతో కలిపి రూ.7600 కోట్లు కెయిర్న్ ఎనర్జీకే భారత ప్రభుత్వం చెల్లించాలని తెలిపింది.
వొడాఫోన్ కేసు: కెయిర్న్ ఆర్బిట్రేషన్ తీర్పు కోసం ప్రభుత్వం వెయిటింగ్
రెండో ప్రతికూల తీర్పు
వొడాఫోన్ తర్వాత భారత్కు వ్యతిరేకంగా ఇది రెండో ప్రతికూల తీర్పు కావడం గమనార్హం. వొడాఫోన్ సంస్థకు సంబంధించి రెట్రోస్పెక్టివ్ కేసు విషయంలో భారత్కు ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. భారత్లో ఆపరేట్ అవుతున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడి చట్టాలకు లోబడి కొనసాగాలని తేల్చి చెప్పింది. ఈ నేఫథ్యంలో ఆర్బిట్రేషన్ తీర్పు ఇండియా చట్టాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. వొడాఫోన్ కేసు ఆర్బిట్రేషన్ తీర్పును సవాల్ చేసేందుకు ఉన్న 90 రోజుల గడువు రేపటితో ముగియనుంది.
డివిడెండ్, రీఫండ్ నిలిపివేత
2007లో కంపెనీ అంతర్గత పునర్ వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్రం పన్నుల విభాగం కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన తర్వాత 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని పేర్కొంది. పునర్ వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై పన్ను చెల్లించాలని తెలిపింది. 2010-11లో కెయిర్న్ ఎనర్జీ భారత్లోని తన కెయిర్న్ ఇండియాను వేదాంతకు విక్రయించింది. వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లలో ఐదు శాతం వాటా లభించింది. ఈ ఐదు శాతాన్ని భారత ప్రభుత్వం గతంలో అటాచ్ చేసింది. రూ.1100 కోట్లకు పైగా డివిడెండ్, దాదాపు రూ.1600 కోట్ల ట్యాక్స్ రీఫండ్స్ నిలిపివేసింది. అటాచ్ చేసిన షేర్లను కూడా విక్రయించింది.
7600 కోట్లు చెల్లించాలని
ఈ నేపథ్యంలో బ్రిటన్-ఇండియా ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద ఈ నోటుసులను కెయిర్న్ ఎనర్జీ.. ఆర్బిట్రేషన్లో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ పన్ను నోటీసులు ఉల్లంఘించారని తీర్పు చెప్పింది. అలాగే డివిడెండ్లు, ట్యాక్స్ రీఫండ్, షేర్ల విక్రయం వల్ల జరిగిన నష్టాన్ని భారత్ చెల్లించాలని తెలిపింది. ఈ బ్రిటిషన్ కంపెనీకి ఇండియా రూ.7600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.